Tirupati : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాపు నాయకులు. కాపు నాయకులు, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ... పవన్ కల్యాణ్ కాపులను కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో దూషించారని  అలిపిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు.  రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రదర్శించాల్సింది పోయి బూతులు తిట్టే వ్యక్తి పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని అన్నారు. ఇదే విధంగా మాట్లాడితే తిరుపతి నగరంలోని బలిజలు తిరుపతిలో అడుగు కూడా పెట్టనివ్వరని హెచ్చరించారు. పవన్ కు  అవసరమైతే కేఏ పాల్ కూడా కలుస్తారని విమర్శించారు.

  


మంత్రి దాడి శెట్టి ఆరోపణలు  


రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని మర్చిపోయారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు తట్టుకోలేరన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడిని తోడేసుకున్నారన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుకు తోడొచ్చారని విమర్శించారు. ప్రజలు మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎవరు దూరం చేయలేరన్నారు. ముఖ్యమంత్రిపై అనూహ్య స్పందన చూసి ఓర్వలేక అలజడి సృష్టిస్తున్నారన్నారు. ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఎంత ఆవేశంగా ఊగిపోయినా ప్యాకేజీ రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.  చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి పవన్ చంద్రబాబు చలిగాసుకుంటున్నారని ఆరోపించారు. 


ముసుగు తొలగిపోయింది-జోగి రమేష్ 


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ అంటే వేరే అర్థాలు చెప్పారు. ఆయన వాగుడుతో అది మరోసారి తేటతెల్లమైందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ కల్యాణ్ అని తాను ఇంతకు ముందు చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని అన్నారు. ప్యాకేజీ స్టార్ అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా.. లేక నీ యజమాని కొనిచ్చారా అంటూ పవన్ కల్యాణ్ ను జోగి రమేష్ ప్రశ్నించారు. "ముసుగు దొంగల నిజస్వరూపం బయటపడింది. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్. ప్యాకేజీకి అమ్ముడుపోయే వారే పవన్ కల్యాణ్. చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రిని అవుతా అని అన్నావా..? చంద్రబాబు సంకలో పవన్ కల్యాణ్ లేరా..? ఆ చెప్పు అయినా నీదేనా.. లేక నీ యజమాని కొనిచ్చారా..? 2019 లో చెప్పులు అరిగేటట్టు మిమ్మల్ని కొట్టినా బుద్ధి రాలేదు. ఎన్నికల్లో యుద్ధం చేసి ఓడిపోలేదా..? పవన్ చేతికి నిన్న ఎక్కువ ప్యాకేజీ అందినట్లుగా ఉంది.. అందుకే ఎక్కువ మాట్లాడేశారు. 


విశాఖ గర్జన విజయవంతం కావడంతోనే పవన్ దాడి చేయించారు. కర్రలు, రాళ్లతో దాడి చేయించారు. సైకోలను మా మీదకు పంపారు. పవన్ కల్యాణ్ పిచ్చిXXX అని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఆయన వాగుడుతో అది మరోసారి తేటతెల్లమైంది. అభివృద్ధి ప్రతీ గడపకు చేరాలని ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. మా సిద్ధాంతం, అజెండా పరిపాలన వికేంద్రీకరణ అయితే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్లాల గురించి మాట్లాడుతున్నారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాడు. అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడమే వీళ్ల సిద్ధాంతం. సినిమా డైలాగులు ఎక్కడ చెప్పాలో తెలియక.. ఇక్కడ మాట్లాడుతున్నారు. అని ఘాటు విమర్శలు చేశారు.