చిత్తూరు : 
చిత్తూరులో‌ దారుణం‌ జరిగింది. వేలూరు రోడ్డులోని ఆనంద ధియేటర్ వద్ద బ్యూటీ పార్లర్ నడుపుతున్న యువతి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే యువతి మృతిదేహం పక్కనే‌ ఓ యువకుడు రక్తపు మడుగులో‌పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో ఉన్న యువకుడికి ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


చిత్తూరు డీఎస్పీ‌ శ్రీనివాసమూర్తి‌ తెలిపిన వివరాలిలా.. చిత్తూరు తాలూకా పోలీసు స్టేషను లో ఏఎస్సై రెండోవ కుమార్తె దుర్గా ప్రశాంతికి కొన్ని నెలల‌ కిందట ఫేస్ బుక్ ద్వారా భద్రాద్రికి చెందిన చక్రవర్తి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో చక్రవర్తి హైదరాబాదులోని‌ ఓ ప్రముఖ హోటల్‌లో చెఫ్ గా పని చేస్తున్నాడు. అయితే గత రెండు నెలల‌ కిందట చక్రవర్తి తన కుటుంబంతో కలిసి చిత్తూరులో‌ని దుర్గా ప్రశాంతి‌ ఇంటికి దగ్గరే ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం‌ బాగా పెరిగింది. ఇరు కుటుంబాలు కలిసి‌ దేవాలయాల సందర్శనాలు సైతం కలిసి వెళ్ళేవారు.


ఇంతలో ఏం జరిగిందో ఏమో‌ గానీ మంగళవారం మధ్యాహ్నం తాను నడుపుతున్న బ్యూటీ పార్లర్ లో యువతి దుర్గ ప్రశాంతి విగత జీవిలా పడి ఉండగా, ఆమె మృతదేహం ప్రక్కనే చక్రవర్తి రక్తపు‌మడుగులో‌ పడి‌ ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బ్యూటీ పార్లర్ కు చేరుకుని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న చక్రవర్తిని చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. యువతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం చక్రవర్తి పరిస్ధితి విషమంగా ఉండడంతో‌ పోలీసులు తమదైన శైలిలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారా లేక చక్రవర్తి ముందుగా దుర్గా ప్రశాంతిని నొంతు నులిమి హత్య చేసిన తర్వాత తాను బ్లేడ్ తో చేయి, గొంతు కోసుకున్నాడా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు బయటకు రానున్నాయి.