Anantapur Crime News: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్యపాలెం సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు ఆర్బీకేలకు ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనాథ్ పై అధికారులు పని ఒత్తిడి చెపంచినట్లు తెలుస్తోంది. శ్రీనాథ్ ను బీఎల్ఓగా విధులు నిర్వర్తించాలని బలవంతం చేసినట్లు సమాచారం. పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ ఉద్యోగులను శాఖేతర పనులకు ఉపయోగించు కోకూడదని ప్రభుత్వం జీఓ జారీ చేసిందని.. ఆ జీఓ ప్రకారం తనను బీఎల్ఓగా విధులకు దూరంగా ఉంచాలని తహశీల్దార్ ను కోరగా... అందుకు ఆయన ఒప్పుకోలేదని అంటున్నారు. అలాగే ఆర్బీకే విధుల్లో పని ఒత్తిడి ఉందని శ్రీనాథ్ చెప్పినా అధికారులు వినిపించుకోకుండా అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన శ్రీనాథ్ తాను నివాసం ఉంటున్న గదిలోనే పురుగుల మందు తాగాడు. విషయం గుర్తించిన స్థానికులు శ్రీనాథ్ ను గుంతకల్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.