కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని కిష్కింద హనుమంతుని జన్మస్థానం అని తాము తెలిపినట్టు గోవిందానంద సరస్వతి(Govindanand Saraswathi) స్వామి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం అవాస్తవ‌మ‌ని టీటీడీ తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. గోవిందానంద సరస్వతి స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గోవిందానంద సరస్వతి స్వామి గురువారం తిరుప‌తి(Tirupati)లోని  గోవింద‌రాజ‌ స్వామి వారి ఆల‌యం వ‌ద్ద గ‌ల మ‌ఠాల‌కు వ‌చ్చి తిరుమల(Tirumala) పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలోని కిష్కిందే(Kishkinda) హనుమంతుని జన్మస్థానమని ఇద్దరు జీయ‌ర్‌ స్వాములు అంగీక‌రించార‌న్నారు. జీయర్ స్వాములు ఎక్కడ అడ్డు చెబుతారో అన్న భ‌యంతోనే టీటీడీ అధికారులు బుధ‌వారం ఆకాశగంగ(Akashaganga) వ‌ద్ద జ‌రిగిన భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించ‌లేద‌ని పేర్కొన్నారు. 


అంజనాద్రే హనుమంతుని జన్మస్థానం


గోవిందానంద స్వామి వ్యాఖ్యల‌ను ఇద్దరు జీయ‌ర్ స్వాములు(Jeeyar Swamjis) త‌ప్పు ప‌ట్టారు. ఆ వ్యాఖ్యలను నమ్మరాదని భ‌క్తుల‌కు విజ్ఞప్తి చేశారు. శ్రీ‌మ‌ద్ భగవద్ రామానుజుల సంకలనం చేసిన శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథంలో పలు పురాణ వచనాలను ఉటంకించిన‌ట్టు ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతాచార్యులు తెలిపార‌ని పేర్కొన్నారు. శ్రీ వేంకటాచల మహాత్మ్యంలో ప్రస్తావించిన పలు పురాణ వచనాల్లో తిరుమలలోని అంజనాద్రే  హనుమంతుని జన్మస్థానమని(Hanuman Janamsthan) తెలిపారు. శ్రీ‌మ‌ద్ భగవద్ రామానుజులు ప్రతిపాదించిన శ్రీ వేంకటాచల మహాత్మ్యాన్ని పరమ ప్రమాణంగా భావిస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ ప్రకారం తిరుమలలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థానమని మ‌రోసారి స్పష్టం చేశారు.


గోవిందానంద సరస్వతి వాదన


ఆంజనేయస్వామి తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని హనుమన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Hanuman Janmabhoomi Tirtha Kshetra Trust) గోవిందానంద సరస్వతి ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం కిష్కింధ(Kishkinda)లోని పంపా నదిక్షేత్రంలోనే పుట్టారని స్పష్టం చేశారు. టీటీడీ దైవద్రోహం చేస్తోందని, హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని టీటీడీ ముద్రిస్తోందన్నారు. టీటీడీ పాలక మండలి(TTD Board) నాటకం ఆడుతోందని, సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. అంజనాద్రి పేరుతో తిరుమల(Tirumala)లో షాపులు నిర్మించి డబ్బులను సంపాదించాలని పాలక మండలి ప్రయత్నిస్తోందన్నారు. కిష్కింధ హనుమంతుని జన్మ స్థలమని ప్రజలకు తెలియజేస్తామన్నారు. రూ.1200 కోట్లతో కిష్కంధను అభివృద్ధి చేస్తామని ప్రకటించారన్నారు. టీటీడీ(TTD)ని తాను డబ్బులు డిమాండ్ చేశానని ఆరోపణలు చేస్తున్నారని, రూ.100 కోట్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే గుండు కొట్టుకుని తిరుగుతానన్నారు.


Also Read: తిరుమలలోని అంజనీ పుత్రుడి జన్మస్థలం అభివృద్ధికి వైభవంగా శంకుస్థాపన