తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలకు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. 


పండితుల వేదాశీర్వచనం 


స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు, ఏపీ హై కోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ప్రశాంత్ మిశ్రాకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ తయారు చేసిన అగరబత్తులు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 




Also Read: ఆయుధ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. 


చక్రస్నానం ఘట్టాన్ని వీక్షించిన సీజేఐ


స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ ముందుగా మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంవో జస్టిస్‌ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్ జె.కె.మహేశ్వరి శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన చక్రస్నానం ఘట్టంలో సీజేఐ సహా ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. మూలవిరాట్‌ అభిషేకం అనంతరం వీఐపీ విరామ సమయంలో సీజేఐ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద జస్టిస్‌ ఎన్వీ రమణ కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 




Also Read: చెడుపై మంచి సాధించిన విజయం.. ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల దసరా శుభాకాంక్షలు


శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు


తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నటుడు సప్తగిరి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. మంచి టాక్ వచ్చిందని భాస్కర్ చెప్పారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. 


Also Read:  తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి