Huge Relief For CM Chandrababu In Supreme Court: ఏపీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలన్న గత వైసీపీ ప్రభుత్వ పిటిషన్‌ను బుధవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. కాగా, ఈ కేసులో 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

'మీకేంటి సంబంధం'

కాగా, చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర్‌ తిలక్‌‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  'మీరెవరు.. మీకేం సంబంధం.. పిల్‌ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి?' అని ప్రశ్నించింది. బెయిల్‌ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) ఎందుకు ఉంటారని నిలదీసింది. సంబంధ లేని బెయిల్‌ వ్యవహారాల్లో పిటిషన్‌ ఎలా వేస్తారని జస్టిస్‌ బేలా త్రివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే... తీవ్ర పరిణామాలు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. ఆయన దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Also Read: Nara Lokesh: సంక్రాంతి వేడుకల్లో బ్రాహ్మణికి లోకేశ్ అదిరిపోయే గిఫ్ట్ - ఆమె రిప్లై ఇదే!