ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం తరపున కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సత్యనారాయణ బెంచ్ ఎదుటకు విచారకు వచ్చింది. అయితే ఆ పిటిషన్ పరిధి సింగిల్ జడ్జి కిందకు రాదని డివిజనల్ బెంచ్ పరిధిలోకి వస్తుందని జస్టిస్ సత్యనారాయణ తేల్చారు. నిర్ణయం తీసుకునేలా చీఫ్‌జస్టిస్‌కు పంపాలని రిజిస్ట్రీకి సూచించి వాయిదా వేశారు.  


ఇలా ఉద్యోగుల పిటిషన్‌పై విచారణను చీఫ్ జస్టిస్‌కు పంపాలని ధర్మాసనం సూచించడం ఇది రెండో సారి. ఈ పిటిషన్‌ను మొదట నాలుగు రోజుల కిందట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ భానుమతి ధర్మాసనం విచారణ జరిపింది. ఆ రోజు ఉదయం విచారణ జరిపిన సమయంలో కీలక వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. జీతాలు పెంచే , తగ్గించే అధికారం  ప్రభుత్వాలకు ఉంటుందని పీఆర్సీ పర్సంటేజ్‌లపై చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని వ్యాఖ్యానించింది. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని అడిగారు. ఆ రోజు మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ పిటిషన్ వేసిన కృష్ణయ్యతో పాటు సమ్మెకు నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి సభ్యులను హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. 


అయితే వారు హైకోర్టు విచారణకు హాజరు కాలేదు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో తాము లేమని ఎందుకు హాజరు కావాలని పీఆర్సీ సాధన సమితి సభ్యులు భావించి ఆగిపోయారు. అయితే  మళ్లీ విచారణ ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా ధర్మాసనం పిటిషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్‌ కూడా కాదని .. వ్యక్తిగత సర్వీస్‌కు సంబంధించిన మేటర్‌ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని చెప్పి వెరొకిరికి రిఫర్ చేయాలని చీఫ్ జస్టిస్‌కు రిఫర్ చేశారు. ఆ తర్వాత రోస్టర్‌లో భాగంగా ఈ కేసు విచారణ జస్టిస్ సత్యనారాయణ ముందుకు వస్తే ఆయన డివిజనల్ బెంచ్ కు సిఫార్సు చేయాలని సూచించారు. దీంతో  విచారణ మళ్లీ వాయిదా పడింది. 


విభజన చట్టం ప్రకారం తమ  అలవెన్స్‌లు.. ప్రయోజనాలు తగ్గించడానికి లేదని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ తరపున కృష్ణయ్య వాదిస్తున్నారు. ఈ అంశంపై విచారణ వాయిదా పడుతూండటం.. తొలి రోజు విచారణలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవడంతో మళ్లీ విచారణ ఎప్పుడు జరుగుతుందా అని ఉద్యోగులు సైతం ఎదురు చూస్తున్నారు.