Telugu Woman Has Been Appointed As Judge In US: తెలుగు వారు ఎక్కడకు వెళ్లినా తమ ప్రతిభతో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. తాజాగా, ఓ తెలుగు మహిళకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని (California) శాక్రమెంటో సుపీరియర్ కోర్డు జడ్జిగా విజయవాడకు (Vijayawada) చెందిన జయ బాడిగ (Jaya Badiga) నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022 నుంచి కోర్టు కమిషనర్ గా పని చేస్తోన్న ఈమె.. కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. జయ బాడిగకు ఈ అరుదైన అవకాశం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 


ఇదీ కుటుంబ నేపథ్యం


ఏపీలోని విజయవాడలో పుట్టిన జయ బాడిగ హైదరాబాద్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1991 -94 మధ్య ఉస్మానియా వర్శిటీ నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. 3 దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ బోస్టన్ విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ పని చేశారు. పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె జయ బాడిగ కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులు కావడంతో స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


జయ బాడిగ తండ్రి రామకృష్ణ 2004 - 09 వరకూ కృష్ణా జిల్లా మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. బాడిగ రామకృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో జయ మూడో కుమార్తె. హైదరాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం.. ఉస్మానియా వర్శిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ లో బీఏ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లిన ఆమె.. బోస్టన్ వర్శిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్శిటీ నుంచి లా పట్టాను పొందారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్‌లో అర్హత సాధించి.. అమెరికాలో పదేళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. అనంతరం పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. జయ బాడిగతో పాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్ సింగ్ బధేషా సహా 18 మంది న్యాయమూర్తులుగా నియమిస్తూ గవర్నర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: Palnadu News: పల్నాడు: మగవాళ్లు ఊరొదిలి ఎందుకు వెళ్లారు? ఆడవారు గుడిలో ఎందుకు దాక్కున్నారు?