Tdp Chief Chandrababu Tweet On Bcs Guarantees: ఆధునిక సమాజంలో 'కుల నిర్మూలన' ఉద్యమాలకు బీజం వేసిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పులే అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాల్లో భాగంగానే టీడీపీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాలు, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించామని అన్నారు. టీడీపీ బీసీల పార్టీగా పేరొందింది. వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీదే అని ఇవాళ చెప్పుకోగలుగుతున్నామంటే.. ఆ ప్రేరణ పులే ఆశయాల నుంచి వచ్చిందే అని పేర్కొన్నారు. పులే జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'జ్యోతిరావు పులే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం. వెనుకబడిన వర్గాల స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వృత్తిదారులకు ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు విలువైన పరికరాలు అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి.. పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి ఇస్తాం. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం.' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.






Also Read: Ongole News: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత - ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు