Chandrababu cancels Tirumala tour:


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన రద్దయింది. కోర్టు ఆదేశాలతో టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ చంద్రబాబు కలవరు అని అచ్చెన్నాయుడు తెలిపారు. 


సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారని, ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ముందుగా అనుకున్న తిరుమల పర్యటనను రద్దు చేసుకుని, ఆరోగ్య పరీక్షల నిమిత్తం బుధవారం హైదరాబాద్ వెళ్తున్నారు. పార్టీ నేతలకు ఎవరిని కలవరు. కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని అచ్చెన్నాయుడు కోరారు.


ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 52 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు అండగా నిలిచారని అది మరచిపోలేనని చెప్పుకొచ్చారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటు తన విడుదలకు ప్రత్యేక పూజలు, అనేక కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ జీవితాంతం తోడుగా ఉంటానని అన్నారు. అనంతరం రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. అర్ధరాత్రి తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.


జాతీయ రహదారిపై స్తంభించిపోయిన ట్రాఫిక్
టిడిపి అధినేత చంద్రబాబు రాక సందర్భంగా జాతీయ రహదారిపై  ట్రాఫిక్. స్తంభించిపోయింది. పూళ్ల, కురెళ్లగూడెం, పాతూరు సెంటరు మీదుగా  గుండుగొలను చంద్రబాబు కాన్వాయ్  చేరుకుంది. చంద్రబాబును చూసేందుకు భారీగా మహిళలు, అభిమానులు రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబును చూడాలంటూ పలుచోట్ల కాన్వాయ్ కు ప్రజలు, కార్యకర్తలు అడ్డుపడుతున్నారు. దారి పొడవునా పెద్దఎత్తున తరలివస్తున్న అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు.