​JC Prabhakar Reddy : వైసీపీ ప్రభుత్వంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.  ఇసుక రీచ్ నుంచి బయటికి వస్తున్న లారీలు, టిప్పర్లను జేసీ అడ్డుకున్నారు. పెద్దపప్పూరులో ఇసుకరీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని జేసీ ప్రభాకర్ భీష్మించుకు కూర్చున్నారు.   అధికారులు నిబంధనలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు కాసులు వర్షం కురిపించేలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఇసుక తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.


వైసీపీ నేతల ఇష్టారాజ్యం 


మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక యథేచ్చగా తరలిస్తున్నా జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇంత మొత్తంలో తవ్వకాలకు అనుమతులు ఉంటే చూపాలని, లేదంటే బాధ్యులపై కేసు పెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని నిరసన విరమించుకోవాలని సూచించినా పట్టించుకోలేదు.  మైనింగ్ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జేసీ ప్రభాకర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 


అనుమతి పత్రాలు చూపాలని డిమాండ్ 


అనుమతి లేకుండా  ఉల్లికల్లు ఇసుక రీచ్ నుంచి  ఇసుకను తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్  చేశారు.  ఉల్లికల్లు  ఇసుక రీచ్ వద్ద  రోడ్డుపై  బైఠాయించిన  జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇసుక రీచ్ కు అనుమతి  ఉంటే  అనుమతి పత్రాలు చూపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్  చేశారు. ఇసుక రీచ్   కి అనుమతి ఉందని  మైన్స్  అధికారులు, తహసీల్దార్  పత్రాలు చూపాలని కోరారు. ధర్నాకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేసి పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు.  


నిబంధనలు గాలికి 


మైనింగ్ అధికారులు నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలకు ఇసుక రీచ్ లు కట్టబెడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆందోళనలో భాగంగా ఇసుక రీచ్ నుంచి బయటికి వస్తున్న లారీలు, టిప్పర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఇసుక తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపే వరకు అక్కడ నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.  పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. తాడిపత్రిలో తరచూ ఆందోళనలు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. తన అనుచరుడిపై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు.     


 జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడ?


 తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇసుక రీచ్ వద్ద ఆందోళన చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన ఆచూకీ చెప్పడంలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.   పెద్దపప్పూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు దిగ్బంధించారు. ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న విషయం చెప్పడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.