JC Prabhakar Reddy : 'రేయ్ పోలీసు మీపై నమ్మకం పోయింది' అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ మద్దతుదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తను అనంతపురం ఆసుపత్రిలో జేసీ పరామర్శించారు. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయిందన్నారు. గాయపడిన గండికోట కార్తీక్ ను మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలిస్తామన్నారు. డీఎస్పీ చైతన్య పోలీసేనా? ఏ చైతన్య ఏమి చేస్తావు ? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కేసు పెడతానని, 307 సెక్షన్ వేస్తారా అని ప్రశ్నించారు.


పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయింది- జేసీ


"మేము పోలీసులకు ఫిర్యాదు చెయ్యం, ఈ దాడిపై సుమోటో కేసుగా కట్టుకొని విచారణ చేయాలి. పోలీసులతో న్యాయం జరగదు. కంప్లైంట్ ఇవ్వడానికి పేపరు పెన్ను వేస్ట్. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పంచి ఇప్పించి కొడతాం. పోలీసులు ఉన్నారని ఉరుకున్నాం. మేము కేసులు పెడితే మడిచి వెనుక పెట్టుకుంటున్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ వాళ్లపై పెట్టిన కేసులు మడిచి జేబులో పెట్టుకుంటాం. మేం ఎవరికీ తలవంచం. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెట్టరు. టీడీపీ వాళ్లు ఏమైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తుంది. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. ప్రజలు మాతోనే ఉన్నారు. ఒక్కొక్కరిని పరిగెట్టిస్తాం. ఇదే నా సవాల్. డీఎస్పీ చైతన్య తీరు అభ్యంతకరం."- జేసీ ప్రభాకర్ రెడ్డి 


జేసీ అనుచరుడిపై దాడి 


అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం చేశారు కొందు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొంతమంది యువకులు ఆయనపై దాడి చేశారు.  దీంతో కార్తీక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు కార్తీక్ తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే నెపంతో వైసీపీకి చెందిన వాల్లే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు. 


జేసీ వర్సెస్ డీఎస్పీ 


డీఎస్పీ చైతన్యపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. టైం దొరికినప్పుడు డీఎస్పీపై జేసీ విరుచుకుపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని ఆరోపించారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది డీఎస్పీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తన సంబంధీకులు 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు.