YS Viveka Murder Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇతర రాష్ట్రాల్లో విచారించేలా చూడాలని  ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ వారి స్పందనను చూసిన తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. తదుపరి విచారణ వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం సీబీఐకి అడ్డంకులు సృష్టిస్తోందని..  కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని సునీత ఆగస్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తన తండ్రి హత్య కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా...కేసు విచారణ ముందుకు సాగేలా కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 


న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్


కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని తెలిపారు.  ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, సీబీఐ, ఏపీ డీజీపీలను చేర్చారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.మూడేళ్లు గడిచినప్పటికీ అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు నిర్ధారణ కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత..సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి. 


వేరే రాష్ట్రంలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి 


తన తండ్రి హంతకులను పట్టుకోవడం లేదని సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. సునీత పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 2020 మార్చి 11న సీబీఐకి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జులై 18న కడపలో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 246 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఏ1గా ఎర్ర గంగిరెడ్డి, ఏ2గా సునీల్‌యాదవ్‌, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ నమోదు చేసింది. వీరిలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదులుగా ఉన్నారు. 


సీబీఐ కూడా తమకు ఆటంకాలు ఎదురవుతున్నాయని హైకోర్టులో పిటిషన్


కేసు విచారణ అంతా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని, సీబీఐ దర్యాప్తునకు ఏపీ పోలీసుల సహకారం లేకుండా చూడడంతో పాటు... కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరాన్ని సమగ్రంగా పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ పైనే కడపలో పోలీసులు కేసు నమోదు చేయడంవంటి అంశాలను పిటిషన్‌లో వివరించారు. కడప కోర్టులో విచారణ జరిగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో పాటు..రాజకీయంగా పలు అంశాలు కేసుతో ముడిపడి ఉన్నాయని సునీత పేర్కొన్నారు. ఇటీవల ఏపీ హైకోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ కూడా చర్చనీయాంశమయింది. తమపైనే కేసులు పెట్టారని.. దాని వల్ల విచారణ చేయలేకపోతున్నామని.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.