Srikakulam District News: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగాంలో పెద్ద ఎత్తున కోతులు మృత్యువాత పడ్డాయి. శిలగాం గ్రామ సమీపంలోని తోటల్లో సుమారు 40 వరకు వానరాలు చనిపోయి గుట్టలుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో  ఉన్నట్లు తెలిపారు. అయితే వీటికి ఎవరో విషాహారం పెట్టి చంపేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. తోటల్లో అపస్మారక స్థితిలో ఉన్న కోతులకు స్థానిక యువకులు ఆహారం అందించారు. మూగ జీవాలపై ఇంత కర్కశంగా వ్యవహరించటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎవరు చంపారు, ఇంత పెద్ద మొత్తంలో కోతులు ఎక్కడినుంచి వచ్చాయి అన్న దానిపై స్థానికులు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్లే వాటిపై ఇంతటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


ఎలుగుబంటి కలకలం.. 


శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. మందస మండలం దున్నవూరు పంచాయతీ మొగిలిపాడు గ్రామంలో అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎలుగుబంటి వీదుల్లోకి వచ్చింది. విషయం గుర్తించిన పలువురు స్థానికులు ఎలుగుబంటి వచ్చిందంటూ కేకలు వేశారు. కొందరు వాటిని ఇళ్లలో నుంచే చూస్తూ.. గజగజా వణికిపోగా, ధైర్యవంతులు దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అంతా కలిసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ... దాన్ని తరిమికొట్టారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎలుగుబంటిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగుబంటి వల్ల ఇళ్లలోనుంచి బయటకు రావాలన్ని భయంగా ఉంటోందని వివరించారు. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒంటరిగా వెళ్లి పనులు చేస్కోలేకపోతున్నామని తెలిపారు. 


అంతకుముందు మన్యం జిల్లాలో కూడా..


పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. కురుపాం నియోజకవర్గం సూర్యనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లాలంటేనా భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. పోడు వ్యవసాయం కోసం కొండ మీదకు వెళ్తోన్న రైతులకు ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు ముగించుకొని విశ్రాంతి కోసం కొండ మీద ఏర్పాటు చేసుకున్న  పాక వద్దకు వెళ్లగా ఆ పాకలో ఉన్న ఎలుగుబంటి కనిపించిందని తెలిపారు. పోడు వ్యవసాయం చేయడానికి వెళ్లాలంటనే భయంగా ఉందని రైతులు అంటున్నారు. ఎలుగుబంటి నుంచి ఎటువంటి ప్రమాదం, ప్రాణహాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. 


రెండు నెలల కిందట గ్రామస్తులపై దాడి.. 


ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామ శివారులో ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేసింది. అతి కష్టంమీద దానిని పట్టుకున్నారు. విశాఖ జూకు తరలించే క్రమంలో ఎలుగుబంటి మృతి చెందింది. తాజాగా అదే ప్రాంతంలో మరో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు హడలిపోతున్నారు. 4 రోజుల క్రితమే. కిడిసింగి వద్ద తోటల్లో ఎలుగుబంటి రైతులపై చేసిన దాడిలో ఒకరి మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువ తాడివాడ వద్ద ఇవాళ మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.