Sharmila innovatively questioned the government on free bus travel for women : తెలుగదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.  విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో టిక్కెట్ తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 


అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నిర్ణయం తీసుకోరా ? 


చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.  రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారని..   తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలో అమలు చేశారని గుర్తు చేశారు.  కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు. కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు.  


నెలకు రూ. మూడు వందల కోట్లు ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నారా ?                


రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని..  రోజు మహిళల ద్వారా  7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం ఆర్టీసీకి వస్తోందన్నారు.   ఉచిత ప్రయాణం కల్పిస్తే...ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయపడుతున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.  . మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు.  మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పధకాలు మహిళలవేనన్నారు.  ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా అని మండిపడ్డారు.  



సీఎంకు మహిళల నుంచి  పోస్టు కార్డులు                            


ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటన్నారు.  5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా చెప్పాలన్నారు.  ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి పథకం.  వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నామని తెలిపారు.