Kodela Sivaram : పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాలకు పూల మాలవేసి నివాళులు అర్పించారు టీడీపీ నేత కోడెల శివరామ్. అనంతరం టీడీపీ నేత కోడెల శివరామ్ మాట్లాడుతూ... పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుడు కోడెల అన్నారు. ప్రతి ఒక్కరికి మార్గదర్శి కోడెల శివప్రసాదరావు అని గుర్తుచేశారు. సత్తెనపల్లిని మోడల్ నియోజకవర్గంగా చేశారన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంపై శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


కన్నాతో వ్యక్తిగత సంబంధాలు లేవు


"వైసీపీ మొదటిగా టార్గెట్ చేసింది కోడెలనే. పార్టీ కోసం పాటుపాడిన వ్యక్తి కోడెల. కోడెలకు నివాళులు అర్పించటానికి రాజకీయం చేస్తున్నారు. 
దీని వెనుక ఎవరువున్నారనేది అర్థం కావటంలేదు. కోడెల పేరు వినపడకుండా కుట్ర చేస్తున్నారు. టీడీపీ కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు కోడెల. చంద్రబాబు మాకు అండగా ఉన్నారు. కన్నా  లక్ష్మీ నారాయణతో నాకు వ్యక్తిగత పరిచయాలు లేవు. కోడెలకి అవమానం జరిగిప్పుడు కన్నా స్పందిస్తే సంతోషంగా ఉండేది. మాపై అక్రమ కేసులు పెట్టారు. కోడెల పేరు తలుచుకోపోవటం బాధాకరం. కోడెల బాటలో నడుస్తాం. అవమానాలను బరిస్తున్నాను" - కోడెల శివరామ్ 






 ఈసారి కూడా టికెట్ కష్టం!   


కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో జాయిన్ అవ్వడంతో సత్తెనపల్లి పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇప్పటి వరకూ సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ తనకే అని భావించిన కోడెల శివరామ్ కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధిష్ఠానం కూడా కోడెలకు టికెట్ లేదని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్తిలో ఉన్న శివరామ్.. సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతున్నారు. సత్తెనపల్లిలో శివరామ్‌కు పోటీగా టీడీపీలో మరోవర్గం తయారైంది.     టికెట్ లేదని టీడీపీ అధిష్ఠానం సమాధానం చెప్పడంతో కోడెల శివరామ్ ఏంచేస్తారన్నది నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఏడాది కోడెల శివప్రసాద్‌ వర్ధంతిని పెద్ద ఎత్తున చేయాలని శివరామ్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఎవరు వస్తారనే దానిపై చర్చ జరుగుంది. కోడెల శివరామ్ ను అధిష్ఠానం బుజ్జగించే చర్యలు చేపడుతుందా? లేదా? అనేదానిపై జోరుగా చర్చజరుగుతుంది. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో కోడెల అంటే తెలుగుదేశం పార్టీ.. టీడీపీ అంటే కోడెల అన్నట్టు ఆ కుటుంబం చక్తం తిప్పింది. అలాంటిది కోడెల శివప్రసాదరావు మరణంతో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. కోడెల తనయుడు శివరామ్ ను ముందు నుంచీ దూరం పెడుతూ వస్తున్నారు.  ఈసారి కూడా టికెట్ లేదని అధిష్ఠానం ఇప్పటికే స్పష్టం చేసింది. పొత్తు పెట్టుకుంటే సత్తెనపల్లి టికెట్ ను టీడీపీ వదులుకుంటుదన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ సమయంలో తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు శివరామ్ కీలక ప్రకటన చేస్తారా? లేక అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతలతో సరిపెట్టుకుంటారో చూడాలి.