2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో కూడా అదే ప్లాన్ కనిపిస్తోంది. 


గతానికి భిన్నంగా టీడీపీ ఈసారి కార్యక్రమాలు చేపడుతోంది. ఎప్పుడూ ఎన్నికలకు ముందు విడుదల చేసే మేనిఫెస్టోనూ ఏడాది ముందుగానే ప్రకటించేస్తోంది. దానిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. 


మేనిఫెస్టో ఎలా ఉంటుందో టీడీపీ అధినేత చంద్రబాబు ముందే టీజర్ ఇచ్చేశారు. ఈసారి సంక్షేం, అభివృద్ధి ప్లస్‌ అనేలా తమ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, అన్ని వర్గాల సమస్యలు ప్రస్తావించేలా మేనిఫెస్టో ఉంటుంది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత అంటున్న జగన్.. అందులో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వాటితోపాటు అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రత్యేక హాదా, ఉద్యోగాల కల్పన, మహిళలకు సంక్షేమ పథకాలు, సీపీఎస్ రద్దు, పోలవరంపై చాలా హామీలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. వాటిలో జగన్ నిరవేర్చినవి గట్టిగా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని చెబుతున్నారు. కేవలం నవరత్నాల మీదనే దృష్టిసారించారే తప్ప మరే ఇతర విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదన్నది టీడీపీ చేస్తున్న విమర్శ. ఆ సమస్యలన్నింటినీ తీర్చేలా ఇప్పటి మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు. 


ప్రభుత్వం మారిన తర్వాత యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని చెబుతోంది టీడీపీ. చదివిన చదువులకు సరైన ఉపాధి అవకాశాలు లేవని ఆరోపిస్తోంది. తొలినాళ్లలో సచివాలయం ఉద్యోగాలను పూర్తి చేయడం తప్ప మరే ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శిస్తోంది. ఏపీలో ఉన్నత విద్యను అభ్యసించిన 35.14 శాతం మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోయారని గుర్తు చేస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ పట్టభద్రుల సంఖ్యను దేశంలో ఉన్న నిరుద్యోగంతో పోల్చితే రెండింతలు ఎక్కువగా ఉందని చెబుతోంది. గత మూడేళ్లలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 10 శాతంకు పైగా పెరిగిందని సీఎంఐఈ నివేదిక వెల్లడించిందని గుర్తు చేస్తోంది. గత 2 ఏళ్లలో 1.75 లక్షల మంది గ్రాడ్యుయేట్లలో  1.13 లక్షల మంది అంటే 95% యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటోంది. 


ఇలాంటి నిరుద్యోం పోవాలంటే రాష్ట్రానికి పెట్టుుబడులు రావాల్సి ఉందని టీడీపీ చెబుతోంది. కానీ జగన్ ప్రభుత్వ వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని ఆరోపిస్తోంది.  అందుకే ఈ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. 2021 ఎన్‌సిఆర్‌బి నివేదిక చూపిస్తోంది. వాటన్నింటికీ పరిష్కారం చూపుతామని టీడీపీ చెబుతోంది. 


గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని టీడీపీ గుర్తు చేస్తోంది. ఫలితంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు పోయాయని ఆరోపిస్తోంది. దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయిందని ఎద్దేవా చేస్తోంది. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అంటున్నారు. అందుకు అమర్ రాజా, జాకీ లాంటి సంస్థలను ఉదాహరణగా చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయిందన్నారు.  


దగాపడిన రైతన్న…


జగన్ వచ్చాక రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని అంటోంది టీడీపీ. రైతు పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడం, సరైన సమయానికి ధ్యానాలు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. నకిలీ విత్తనాలు బెడద కూడా ఎక్కువగా ఉందన్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఎన్సీఆర్బీ విడుదల చేసే గణాంకాల ప్రకారం 2021లో 1065 మంది రైతుల ఆత్మహత్యకు పాల్పడ్డారని...2019 తో పోల్చితే 19 శాతం పెరిగాయని అంటోంది. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ గత మూడేళ్లుగా 3వ స్థానంలో ఉందన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రతీ రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయని వివరిస్తున్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో కూడా ఏపీ రెండో స్థానంలో ఉందని వారి వాదన. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందన్నది వారి అభిప్రాయం. 


చెలరేగిపోతున్న మైనింగ్ మాఫియా.. 


రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని టీడీపీ చేస్తోన్న ఇంకో ఆరోపణ. గ్రావెల్స్ తవ్వకాలు, అక్రమ మైనింగ్‌లో దందా సాగిస్తున్నారని టీడీపీ విమర్శ. ఇసుక దందా కూడా నడిపిస్తున్నారని అంటున్నారు. కొత్త ఇసుక విధానం పేరుతో జేపీ ఇన్ఫ్రాకు కంట్రాక్ట్ కట్టబెట్టారని... దీంతో వైసీపీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని అభియోగాలు మోపుతోంది. 


ఇలాంటి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్టు టీడీపీ లీడర్లు చెబుతున్నారు.