ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు పోలీసులు షాకిచ్చారు. కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద భారీ కంటెయినర్ పెట్టి సోము వీర్రాజు కారును పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వివాదానికి దిగిన బీజేపీ నేత తన దారికి అడ్డు తప్పుకోవాలంటూ పోలీసులను తోసేశారు. దీంతో పోలీసులకూ, సోము వీర్రాజుకు మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


‘వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకు?’ అని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, ఏపీ పోలీసు శాఖను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశ్నించారు. 






కార్యకర్తలు కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి జగన్ పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.






బుధవారం ఉదయం రావులపాలెం నుంచి జొన్నాడ జంక్షన్ వైపు వెళ్తుండగా సోమువీర్రాజు కారుని పోలీసులు నిలిపేశారు. ఆయనను అడ్డుకునేందుకు కారుకు ముందు కంటెయినర్ నిలపడంతో ఆయన వాహనానికి దారి లేదు. తాను ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్తున్నానని, అయినా మీరు నన్ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలంటూ పోలీసులను సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, శాంతియుతంగా వెళ్లే వారిని అడ్డుకోదని చెప్పగా పోలీసులు వినిపించుకోకపోవడంతో వారిని పక్కకు తోసేసి డ్రైవర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.