The Godavari Bridge or Kovvur–Rajahmundry Bridge: 
- రోడ్ కం రైల్ వంతెన పై లారీలు, బస్సులు, లోడ్ వాహనాల రవాణా నిలుపుదల 
- టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలు, కార్లు తిరిగేందుకు అనుమతి 
- భారీ వాహనాలు, బస్సులు గామన్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించాలి 
- జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఉత్వర్వులు జారీ


తూర్పుగోదావరి: రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై ఆంక్షలు విధించారు. రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మీదకు లారీలు, బస్సులు నిషేధించారు. కేవలం టూ వీలర్లు, కార్లు మినహా భారీ వాహనాలు బ్రిడ్జి పైకి నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.  


రాజమహేంద్రవరం కొవ్వూరును అనుసంధానం చేస్తూ అందుబాటులో ఉన్న రోడ్ కం రైల్ వంతెన పై లారీలు, బస్సులను నిలిపి వేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన తరువాత 1974 నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జి జీవిత కాలం 65 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ క్రమంలో రోడ్ కం రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చి 49 సంవత్సరాలు పూర్తి కానుంది.


రోజురోజుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ వంతెనపై భారీ లోడుతో వెళ్లే వాహనాలు నడపడం వల్ల, డెక్ జాయింట్‌లపై ఉన్న ప్రాంతాల్లో దెబ్బతింటున్న దృష్ట్యా , ట్రాఫిక్ రద్దీతో పాటు  వంతెన యొక్క భద్రత దృష్ట్యా భారీ వాహనాలను బ్రిడ్జి మీదకు నిషేధించారు. ఆర్ అండ్ బి అధికారులు చేసిన సూచనలు మేరకు లారీ లు, బస్సులు లకు ఈ వంతెన మార్గం ద్వారా తిరగటాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మాధవీలత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వంతెన మనుగడ, మరిన్ని సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధానంలో భాగంగా టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలు, కార్లు తిరిగేందుకు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని మాధవీలత పేర్కొన్నారు. 


ఈ వంతెన మీదుగా 10.2 టన్నుల బరువు మించి ఉన్న వాహనాలు తిరిగితే వంతెన దెబ్బ తినే అవకాశం ఉందని 2007, 2011 లో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు గుర్తుచేశారు. బ్రిడ్జి సేఫ్టీ, ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలు తమకు సహకరించాలని కోరారు. అనుమతించిన వాహనాలు వంతెన మీద తిరిగేలా మధ్యలో పోల్స్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. 


తుర్పు గోదావరి జిల్లా కి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా రవాణా అధికారి, జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్టీసీ) వారికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  కొవ్వూరు -  రాజమహేంద్రవరం మీదుగా ప్రయాణం చేసే భారీ వాహన దారులు, బస్సులు జాతీయ రహదారి మీద ఉన్న నాలుగు లైనుల వంతెన గామన్ బ్రిడ్జి (4వ వంతెన ) మీదుగా రాకపోకలు సాగించవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial