Rajahmundry To Kashi Vishwanath Temple: తూర్పుగోదావరి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. 11 రోజుల్లో 13 పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాశీలో శివరాత్రి పూజలు చేసుకునేలా ఈ ప్యాకేజీ రూపొందించింది. ఇప్పటికే అమలులోకి వచ్చిన ఈ ప్యాకేజీకి మంచి స్పందన వస్తోంది. చాలా మంది పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారు. దీన్ని మరింత మందికి చేరువ చేసేలా కార్యచరణ రూపొందిస్తోంది ఆర్టీసీ.  


జీవితంలో ఒకసారైనా కాశీ వెళ్లాలనే చాలా మందికి ఉంటుంది. అయితే వెళ్లిరావడం, టికెట్ల లభ్యత, దూరాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది తమ కోరికను తీర్చుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ల కోసం ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది ఆర్టీసీ. సాధారణ రోజుల్లోనే కాశీ వెళ్తే అబ్బో అనుకుంటారు. అలాంటిది శివునికి అంతే ఇష్టమైన శివరాత్రి రోజు వెళ్తే ఇంకా ఆనందం వేరే లెవల్ కదా. అందుకే అలాంటి మహదావశాకాన్ని భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ కల్పిస్తోంది. 


కాశీ విశ్వేశ్వరుని దర్శన కోసం తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా గతేడాది మూడు బస్సులను కాశీ యాత్రకు పంపించారు. ఈసారి మరిన్ని బస్‌లను పంపించాలని ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఒక బస్‌ పూర్తిగా నిండిపోయేలా భక్తులు తమ టికెట్లు బుక్ చేసుకున్నారు. 


Also Read: హైదరాబాద్​ టూ ఊటీ, కూనూర్.. రౌండ్ ట్రిప్ బడ్జెట్ 8k, డిటైల్స్ ఇవే


శివరాత్రి రోజున కాశీలో ఉండేలా టూర్ ప్యాకేజీని డిజైన్ చేశారు. శివరాత్రికి ఐదు రోజుల ముందు బస్‌ ఇక్కడి నుంచి బయల్దేరనుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు దర్శించుకునే ఆలయాలు ఇవే :- 


లింగరాజస్వామి ఆలయం(భువనేశ్వర్‌) 


జగన్నాథస్వామి ఆలయం (పూరీ) 


సూర్యనారాయణ స్వామి ఆలయం (కోణార్క్) 


గిరిజాదేవి ఆలయం (జాబూర్‌) 


బడే హనుమాన్(అలహాబాద్) 


శ్రీ కళ్యాణిదేవి ఆలయం(అలహాబాద్) 


త్రివేణి సంగమం 


కాశీ విశ్వేశ్వరస్వామి (జ్యోతిర్లింగం), 


శ్రీ కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయం 


అయోధ్య బలరామ మందిరం 


సీతామడిలో సీతాసమహిత్ స్థల్ (సీతామర్షి ఆలయం) 


నైమిశారణ్యంలో గోమతి నదీస్నానం 


చక్రతీర్థం 


రుద్రావర్తం 


లలితాదేవి (ఉపశక్తిపీఠం) 


గయలో విష్ణుపాద ఆలయం 


మంగళగౌరీ ఆలయం, 


బుద్ధగయలో మహాబోధి ఆలయం 


అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం 


అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం 


 ప్రత్యేకంగా వంట మనిషి 
ఈ టూర్‌ ప్యాకేజీల ద్వారా యాత్రలకు వెళ్లేటప్పుడు ఏదో చోట ఆపుతారు. అక్కడే ఏదో హోటల్‌లో తినాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్టీసీ ప్యాకేజీలో మాత్రం బస్‌లో ఒక వంట మనిషి ఉంటారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేస్తారు. ఇవి చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు. వారిలో ఒకరు వంటమనిషి. ముగ్గురు సహాయకులు ఉంటారు.  


యాత్రికుల కోసం 36 పుష్‌ బ్యాక్‌ సీట్లు ఉన్న బస్‌లను పెడతారు. వాటికి టీవీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రతి బస్‌లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. నాలుగ ప్రాంతాల్లో రాత్రి వేళలో బస చేయాల్సి ఉంటుంది. కోణార్క్‌లో ఒక రోజు, కాశీలో రెండు రోజులు, నైమి శారణ్యంలో ఒక రోజు బస చేయాల్సి ఉంటుంది.  


మరిన్ని వివరాల కోసం... 


ఈ టూర్‌ కోసం ఆర్టీసీ 12800 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి టికెట్ ఉండదు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకే ఇంట్లో టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్లను హోం డెలివరీ చేస్తారు. 9502300189, 9966666544, 9866045588 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది. 


Also read: హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి 3K బడ్జెట్ ట్రిప్.. విజయవాడ నుంచి వెళ్తే డెడ్ ఈజీ, ట్రిప్ డిటైల్స్ ఇవే