Papikondalu Vihara Yatra: పాపికొండల విహార యాత్ర లాంచనంగా పునఃప్రారంభించెందుకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో పాపికొండల పర్యాటక ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది. కానీ ప్రారంభిస్తామని చెప్పిన సమయానికి మాత్రం యాత్ర ప్రారంభం కాకపోవడంతో పలువురు పర్యాటక ప్రేమికుల్లో కొంత నిరాశ చెందుతున్నారు. వి. ఆర్. పురం మండలం, పోచవరం గ్రామంలోని గోదావరి నుండి, నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. 
సాంకేతిక కారణాలున్నాయా !
పాపికొండల విహార యాత్ర (Papikondalu Boat Tourism)కు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చినా సాంకేతిక పరమైన పలు అంశాల్లో ఇంకా ఫోకస్ చేయడం వల్లనే ఇంకా ప్రారంభం చేసేందుకు ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. మరోవైపు పెంచిన యూజర్ ఛార్జీలు భారమవుతోందని ప్రైవేటు బోట్ యాజమాన్యాలు కొంత నిరాసక్తత చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే విహార యాత్రకు ముందస్తు కార్యక్రమంలో భాగంగా, అధికారులు సోమవారం గోదావరిలో ట్రైల్ రన్ సైతం నిర్వహించారు. మొదటి ట్రైల్ రన్ సక్సెస్ కావడంతో పాపికొండల విహారయాత్ర ఇక షురూ అవుతుందన్న క్రమంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. 
పాపికొండల విహార యాత్రకు సంబంధించి నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించే యూజర్ ఛార్జీలు ఈ ఏడాది నుండి ప్రభుత్వం పెంచింది. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల కారణంగా విహార యాత్ర సాగకపోవటం, ఆ తరువాత గోదావరి వరదలతో బోట్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోయి ఉండటం, పెరిగిన నిత్యావసర ధరలు యాజమాన్యానికి ఇబ్బందిగా మారాయి. ఈ పరిణామాల మధ్య నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పాపికొండల విహార యాత్ర వాయిదా పడటానికి కారణమని తెలుస్తుంది. యూజర్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం నుండి వెసులుబాటు లభిస్తే, ఆ తరువాత నిర్వాహకులు పాపికొండల విహార యాత్రను పునఃప్రారంభం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందంటున్నారు ప్రైవేట్ బోటు యాజమాన్యాలు. 


గతంలో కచ్చలూరు వద్ద విషాదం..
దేవి పట్నం మండల పరిధిలోకి వచ్చే కచ్చులూరు వద్ద గతంలో జరిగిన బోటు ప్రమాదంలో పర్యాటకులు 51 మంది మృతిచెంది తీవ్ర విషాదం నెలకొంది. ఆనాటి నుంచి ఇప్పటివరకు పాపికొండల యాత్ర కు బ్రేక్ పడగా మధ్యలో పలుసార్లు ట్రైల్ రన్ నిర్వహించారు. ప్రభుత్వ నిర్దేశించిన సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు కచ్చితంగా అవి పాటించాలని చాలా బోట్లు కు అనుమతులు ఇవ్వలేదు. 
2019 సెప్టెంబరు 15న వశిష్ఠ పున్నమి రాయల్‌ బోటు దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన 51 మంది మృతి చెందారు.. 26 మందిని స్థానికులు రక్షించారు.  గోదావరి నదికి వరద ఎక్కువగా ఉండడంతో 300 అడుగుల లోతున ఉన్న బోటు వెలికితీయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేక సవాళ్ల మధ్య చాలా రోజుల తరువాత బోటును వెలికి తీశారు.


Also Read: Tirumala News: చంద్రగ్రహణం ఎఫెక్ట్, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే !