కాకినాడ రూరల్ పరిధిలోని ప్యారీ షుగర్స్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. కన్వేయర్‌ బెల్టు వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు.  


అసలేం జరిగింది?  


కాకినాడ రూరల్ పరిధిలోని  వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్‌ భారీ పేలుడు జరిగింది. రిఫైనరీలో పేలుడు సంభవించి  ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా కన్వేయర్‌ బెల్టుకు విద్యుత్ కనెక్షన్‌ ఇచ్చే సమయంలో పేలుడు జరిగిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.


ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ(36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు(45)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ(29) పరిస్థితి విషమంగా  ఉందని వైద్యులు తెలిపారు. అతడిని కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది కాకినాడలో పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.