Floods TO Godavari: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం విపరీతంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ ఫ్లో తగ్గట్టుగా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  23.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే అప్రమత్తమైన అధికారులు విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షిస్తున్నారు. అయితే గోదావరి నదికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 25 లక్షల క్యూసెక్కుల వరకు వస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. 


630 గ్రామాలకు ముంపు ముప్పు..


వరద ప్రవాహ ఉద్ధృతి పెరిగితే.. దాదాపు 630కు పైగా గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. మొత్తం 6 జిల్లాల్లోని 44 మండలాల్లో  628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో బాగంగానే ముంపు ప్రభావిత ప్రాంతాల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. సంబంధిత అధికారుల యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


కంట్రోల్ రూముల ఏర్పాటు..


ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలోని 9 మండలాలపై వరద ప్రభావం చూపే  అవకాశం కనిపిస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మండలాలపై వరద ప్రభావం పడనుంది. అలాగే ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం కనిపిస్తోంది. అయితే జిల్లాల్లోని సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వరద ఉద్ధృతి దృష్ట్యా అదనపు సహాయక బృందాలను రంగంలోకి దించారు. సహాయక చర్యల్లో మొత్తం  10 ఎన్డీఆర్ఎఫ్,  10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. 


నీటమునిగిన వందలాది గ్రామాలు


ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఆరు జిల్లా పరిధిలోని  42 మండలాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.  అందులోని 279 గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మరో 177 గ్రామాలపై సైతం వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 62 వేల 337 మందిని ఇప్పటి వరకు తరలించారు. వీరి కోసం 220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి... వరద ప్రభావం ఎదుర్కొంటున్న గ్రామస్థులకు ఆయా కేంద్రాల్లో ఆవాసం కల్పిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 


గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి పరివాహన ప్రాంతాలన్నీ వరద ప్రభావం ఎదుర్కొంటున్నాయి. గోదావరి నదిపై ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. చాలా చోట్ల వరద ఎక్కువగా వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం లాంటి ప్రాజెక్టుల్లో అన్నీ గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తేశారు. కృష్ణా నదిలోనూ ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటంతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణా ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకుంది. తుంగభద్ర నదిలో వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి దిగువకు నీరు వస్తోంది. లక్షలాది క్యూసెక్కుల నీరు రోజంతా తరలుతోంది.