గోదావరికి వరద మళ్లీ పోటెత్తడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. వరద ముంపు గ్రామాల్లో ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు మంచాన పడుతున్నారు. గ్రామంలో సరైన వైద్యం అందక, మరోపక్క బయటకు వెళ్లే మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధానంగా పి. గన్నవరం, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.. అదేవిధంగా విలీన మండలాల్లోనూ విషజ్వరాల తీవ్రత ఎక్కువ గా ఉందని స్థానికులు వాపోతున్నారు.


నెలలోనే రెండుసార్లు


నెల రోజుల వ్యవధిలోనే వరద గోదావరి రెండు సార్లు ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి నదీ పరివాహక ప్రజల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇళ్ల చుట్టూ చేరిన వరద నీటితో నానా అవస్థలు పడ్డ లంక గ్రామాల ప్రజలు ఇప్పుడు విషజ్వరాలతో సతమతమవుతున్నారు. గ్రామాల ముఖద్వారాల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లోకి వచ్చి ఎవ్వరికి ఏ పరిస్థితి ఉందో అన్న కనీస చర్యలు తీసుకోకుండా కేవలం వైద్య శిబిరాల్లో కూర్చుని అరకొర మందులు ఇస్తున్నారని లంక గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మరోపక్క లోపించిన పారిశుద్ధ్యం, బురద, పాముల బెడద లంక గ్రామాల ప్రజలను మరింత ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. 


అధికారులపై ఆగ్రహం


లంక గ్రామాల్లో దోమల విజృంభణ ఎక్కువగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇళ్ల చుట్టూ నిల్వ చేరిన మురికినీటి వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని, వరదకు కొట్టుకొచ్చిన కళేబరాలు, చెత్తా చెదారంతో దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో లంక గ్రామాల్లో రోగాలు విజృంభిస్తున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.


ముంపులోనే పలు లంక గ్రామాలు


ఎగువ ప్రాంతాల్లో కొంత వరకు వరద ఉద్ధృతి తగ్గినా కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాల్లో ముంపునీరు అలాగే ఉంది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వదులుతున్న వరద నీటితో గోదావరి ఉపనదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో నదీపరివాహక లంక గ్రామాల్లో వరదనీటి ముంపులోనే ప్రజలు అవస్థలు పడుతున్నారు.


క్రమంగా తగ్గుతున్న వరద


గోదావరి బేసిన్‌లకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 2.86 లక్షల క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయానికి 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1.73 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 54వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 66 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, తుపాకుల గూడెం తదితర బ్యారేజీలకు సగటున 8 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. రాష్ట్రమంతటా ప్రాజెక్టుల కింద ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. రోజుకు సగటున 46.69 మిలియన్‌ యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో భద్రాచలం సబ్‌కలెక్టరు వెంకటేశ్వర్లు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.