Chandrababu Pawan Kalyan in Nidadavolu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను సింగిల్ గా వస్తున్నానని చెప్పుకుంటున్నారని.. కానీ ఆయన శవాలతో వస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 2014 ఎన్నికల్లో తండ్రిలేని ఒంటివాడినని చెప్పుకున్నాడని, 2019లో తన బాబాయిని చంపేశారని సానుభూతి పొందాడని, ఇప్పుడు పెన్షనర్ల ప్రాణాలు తీసి ఆ కుట్ర టీడీపీపై నెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిడదవోలులో ప్రజా గళం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


జగన్‌ చేసిన విధ్వంసం, అప్పులకు ఏపీ రాష్ట్రం హాస్పిటల్ లో వెంటిలేటర్‌పై ఉన్నట్లుగా ఉందని చంద్రబాబు అన్నారు. కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీయే ఆక్సిజన్‌లా బతికిస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్యేయం అని.. రాజధాని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం ఉందని.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి తమకు ఉందని చెప్పారు.


‘‘మేం కూటమి తరఫున నిర్ధిష్టమైన అజెండాతో వస్తున్నాం. మా ఆడబిడ్డల్ని శక్తివంతంగా చేసే బాధ్యత మాది. సూపర్ సిక్స్ తీసుకువచ్చాం. ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేసి ఇంట్లో ఎంత మంది ఆడపడుచులు ఉంటే అంత మందికి నెలకు 1500 మంది చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తాం. అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. యువత మొత్తం మా వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్ వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు. 


మేము వస్తున్నామంటే రాష్ట్రానికి తిరిగి వస్తారు. తణుకులో హైటెక్ సిటీ లాంటి టవర్ నిర్మాణం చేస్తాం. ఇంటింటికీ మంచినీరు, బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా పేదలకు రూ. 4 వేల ఫించన్ ఇచ్చే బాధ్యత మాది. ఒక నెల తీసుకోకపోతే మరుసటి నెలలో ఇస్తాం. బీసీలకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వికలాంగులకు రూ. 6 వేల ఫించన్ ఇస్తాం. కూటమి ప్రభుత్వంలోనూ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఎవ్వరూ తప్పుడు పనులు చేయోద్దు. మీ జీతం రూ. 10 వేలకు పెంచే బాధ్యత మాది. రాష్ట్రంలో వాలంటర్ వ్యవస్థే లేదని ధర్మాన చెబుతున్నారు. ఎవరూ రాజీనామా చేయొద్దు మీకు మేము అండగా నిలుస్తాం. మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం పెడతాం. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు.