రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ (Chandrababu Health Bulletin) విడుదల చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టైయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. డీహైడ్రేషన్ కు గురయ్యాక చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని, గుండె సమస్య వచ్చే ప్రమాదం ఉందని కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు, ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన 67 కేజీలు బరువు ఉన్నారని ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులె టిన్ లో పేర్కొన్నారు. 


చంద్రబాబుకు బీపీ 140/80 గా ఉంది. పల్స్ నిమిషానికి 70, కాగా రెస్పిరేటరీ రేటు నిమిషానికి 12 సార్లు ఉందని డాక్టర్లు వెల్లడించారు. నిన్నటి తరహాలోనే చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నారని, ఫిజికల్‌ యాక్టివిటీలో ఎలాంటి సమస్య లేదని తెలిపారు.  కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఉంటే బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు కొన్ని రోజుల కిందట డీహైడ్రేషన్ కు గురయ్యారని ఆయనతో ములాఖత్ అనంతరం కుటుంబసభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని పోలీసులను కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసిందని, ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ వరుస నిరసనలు తెలుపుతున్నారు టీడీపీ శ్రేణులు. నేడు సైతం ఇంకెన్నాళ్లు న్యాయానికి సంకెళ్లు అని శాంతియుతంగా నిరసన తెలిపారు.


జైలులో ఉన్న చంద్రబాబుకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఛాతీ, చేతులు, వీపు, నడుము, గడ్డం తదితర భాగాల్లో చంద్రబాబుకు ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయి. ఈ మేరకు రాజమహేంద్రవరం జీజీహెచ్‌ చర్మ సంబంధ వైద్య నిపుణులు డాక్టర్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ సీహెచ్‌.వి సునీత జైలు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. రెండు అరచేతుల్లో పొక్కుల వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వైద్యుల నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవరైనా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని డాక్టర్లు శనివారం ప్రెస్ మీట్ లో చెప్పారు.


కోర్టు ఆదేశాలతో ఏసీ ఏర్పాటు చేసిన అధికారులు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు,  ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు నివేదించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులకు పైగా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది.