ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా గ్రామంలో సుమారు 200 మందికి పైబడే కేన్సర్‌ వ్యాధి లక్షణాలు నిర్ధారణ అవ్వడం కలవరానికి గురిచేస్తోంది.. వైద్యపరీక్షల ద్వారా 23 మందికి కేన్సర్‌ను గుర్తించిన అధికారులు గ్రామంలో ఉన్న పరిస్థితిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతితోపాటు ఉన్నతాధికారులకు వివరించారు.. ఇంకా గ్రామంలో ఎంతమందికి క్యాన్సర్‌ ఉందో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైన అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు.. ప్రాధమికంగా గ్రామంలో చాలా మంది చిన్నారుల్లో కూడా కాలేయ సంబందిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.. ఇదిలా ఉంటే బలభద్రపురంలో క్యాన్సర్‌ కోరల్లో ప్రజలు చిక్కుకుంటున్న పరిస్థితిపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడంతో దీనిపై ప్రభుత్వ, అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టిసారించిన పరిస్థితి కనిపించింది.. 

Continues below advertisement


క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న 23 మంది.. 


బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్‌ కోరలు చాస్తోందన్న వార్త గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.. తమ ఒంట్లో ఏ క్యాన్సర్‌ రాకాసి ఉందోనన్న అనుమానాలు ఆ గ్రామస్తుల మాటల్లో కనిపిస్తున్నాయి.. ఎందుకంటే ఈగ్రామంలోనే ఇప్పటికే 23 మంది క్యాన్సర్‌ బారిన పడడం గమనార్హం. ఇంకా సుమారు 200 మందికి క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ఇంకా అధికారికంగా దృవీకరించకపోయినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా వైద్యశాఖ, కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందాలు సారధ్యంలో గ్రామంలో 32 బృందాలుగా సర్వే చేస్తున్నారు.. అయితే ఇప్పటికే గ్రామంలో 23 మంది క్యాన్సర్‌ చికిత్సలో ఉండగా మరికొంత మందికి ఈ వ్యాధి ఉందన్న సమాచారంతో గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితి నెలకొంది.. 


ఆ ఇండస్ట్రీ వల్లనే.. 


తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే భలభద్రపురం గ్రామంలోనే గ్రాసిమ్‌ కెమికల్‌ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమలున్నాయి..  వీటినుంచి వెలువడే కాలుష్య వల్లనే గ్రామంలో ఈ భయంకర పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు భూగర్భంలో డంపింగ్‌ చేయడం వల్ల భూగర్భజలాలు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.  బలభద్రపురం గ్రామంలో సుమారు 10 వేల మంది జనాభా ఉండగా ఎవ్వరిని కదిపినా క్యాన్సర్‌ కలవరం స్పష్టంగా కనిపిస్తోంది.. ఏప్రిల్‌ 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బలభద్రపురం శివారు ప్రాంతంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీను ప్రారంభించారు..  


అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే..


ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో క్యాన్సర్‌ కోరలు చాస్తోందని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై వైద్యఆరోగ్యశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే ఇప్పటికే గ్రామంలో చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారని, మరింత మందికి ఈ వ్యాధి ఉండే అవకాశం లేకపోలేదని, గ్రామంలో తక్షణ చర్యలు చేపట్టి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలతోపాటు క్యాన్సర్‌ కారకాలను గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు వైద్యఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించారు..