అడిగిన షర్టు ఇవ్వకుండా అమ్మ ఇబ్బంది పెడుతోందని ఓ బాలుడు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేయడం వైరల్‌గా మారింది. ఏలూరు టౌన్‌కు చెందిన ఓ బాలుడు తన ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లాలి వైట్‌ షర్ట్‌ ఇవ్వాలని తల్లిని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో స్నానం చేసి టవల్ కట్టుకొని ఉన్న ఆ బాలుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తల్లిపై ఫిర్యాదు చేశాడు. 


ఏలూరు కొత్తపేటలో సాయిదినేష్‌కు పదేళ్లు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. చాలా రోజు క్రితం ఆ బాలుడి తల్లి మరణించింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె సంరక్షణలోనే బాలుడు ఉంటున్నాడు. ఆదివారం తన ఫ్రెండ్‌ పుట్టిన రోజు ఉంది. పార్టీకి వెళ్లేందుకు స్నానం చేసి వచ్చాడు. వైట్‌ షర్ట్ ఇవ్వాలని మారుతల్లిని అడిగారు. ఆమె ఒప్పుకోలేదు. 


పుట్టిన రోజుకు వెళ్తానని.. వైట్‌ షర్టు కావాలని మారాం చేశాడు. ఆమె మాత్రం ససేమిరా అంది. రెండు దెబ్బలు వేసి ఇంట్లో కూర్చోబెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు. స్నానం చేసిన తర్వాత కట్టుకున్న టవల్‌ తోనే పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఫ్రెండ్‌ పుట్టిన రోజుకు వెళ్తానంటే తన తల్లి వద్దని అంటోందని.. వైట్‌ షర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని పోలీసులకు చెప్పాడు. 


విషయం తెలుసుకున్న పోలీసులు సాయిదినేష్ తల్లిదండ్రులను పిలిపించారు. ముగ్గుర్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలని బాలుడికి చెప్పారు. పిల్లలకు చిన్న చిన్న సరదాలు తీర్చాలని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఇంటికి పంపించేశారు. 


సాయిదినేష్‌ గతేడాది కూడా వార్తల్లో నిలిచాడు. అల్లరి చేస్తున్నాడని గతేడాది ఈ బాలుడికి వాతలు పెట్టింది మారుతల్లి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


ప్రస్తుతం సాయిదినేష్‌ నాల్గో తరగతి పూర్తి చేసి ఐదో తరగతి వెళ్తున్నాడు. రెండేళ్ల క్రితమే ఇతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సాయిదినేష్‌కు సమస్యలు మొదలయ్యాయి. సాయిదినేష్‌కు సోదరి కూడా ఉంది.