Rains In Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారగా, నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై నెలకొంది. తీవ్ర వాయుగుండం క్రమంగా కదులుతూ ఛత్తీస్ గఢ్- వైపు వెళ్తోంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తూర్పు పశ్చిమ షియర్ జోన్ 20 డిగ్రీల ఉత్తర అక్షాంశంతో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కి.మీ మధ్యలో ఉందని అధికారులు వెల్లడించారు. 


తెలంగాణలో మోస్తరు వర్షాలు
ఇదివరకే వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయిని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం.





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నేడు వాయుగుండం తీవ్రరూపం దాల్చనుండగా, దీని ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై ఉంది.  అదే సమయంలో తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. నేడు ఉత్తర కోస్తాంధ్ర లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. 3 జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సైతం వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. యానాంలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 






హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.