Raghurama : నరసాపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు  కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టులో  మరో పిటిషన్  దాఖలు చేశారు.  సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం హైకోర్టులో విచారణకు రావడంతో రఘురామ కృష్ణ రాజు తరపు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ వాదనలు వినిపించారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు. రెండు సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఈ నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి లాయర్ తీసుకొచ్చారు. అలా చేస్తే ఈ కేసు దర్యప్తులో కీలక ఆధారాలు మాయం అయిపోతాయని... వీటన్నింటినీ భద్రపరచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై వెంటనే లిఖిత పూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని గుంటూరు ఆసుపత్రి సూపరెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను  జూన్ 13 కు వాయిదా వేసింది.


జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?


గతంలోనే కాల్ డేటాను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం 


గతంలోనే ఆయన  తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే   రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటా ను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐ  కు ఏపీ హైకోర్టు ఆదేశించింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.   ఈ కేసులో కాల్ డేటా కీలకమని  కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.


నెల్లూరులో రాజన్న భవన్‌కు పోటీగా జగనన్న భవన్- అనిల్‌, రూప్‌ కుమార్‌ పొలిటికల్‌ గేమ్‌లో అప్‌డేట్‌ వెర్షన్


పుట్టిన  రోజు నాడే రాజద్రోహం కేసులో రఘురామ అరెస్ట్


రెండేళ్ల క్రితం పుట్టిన రోజు నాడు హైదరాబాద్ లోని తన ఇంట్లో రఘురామ ఉన్నసమయంలో సీఐడీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆయనను అరెస్ట్ చేసిన రోజున కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. మొదట గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. తర్వాత ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. గుంటూరు ఆస్పత్రిలో పరీక్షల రిపోర్టులు గాయాలు కాలేదని వచ్చాయి. ఆర్మీ ఆస్పత్రిలో మాత్రం గాయాలయ్యాయని రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆయనను కస్టడీలో కొట్టారని రుజువైనట్లయింది.