Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడుక్కుతున్నాయి. అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య ట్వీట్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పురందేశ్వరి ఆరోపణలు, ట్వీట్లపై వైసీపీ నేతలు ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. వీరిలో విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందులోనే ఉన్నారు. పురందేశ్వరి రాజకీయ చరిత్ర నుంచి మొదలు చంద్రబాబు అరెస్ట్ వరకు విమర్శలు చేస్తున్నారు. 


‘ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో  బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే  మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా !’ అంటూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.






కులం, కుటుంబం చుట్టే పురందేశ్వరి రాజకీయాలు అని, నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలేనని, అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే అంటూ పురందేశ్వరిపై విజయసారిరెడ్డి విమర్శించారు. స్వార్థం తప్ప.. సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం అనేవి ఏవీ పురందేశ్వరికి లేవని, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ ట్విటర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలని. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారని ఎద్దేవా చేశారు. 


బంధుత్వం మాటున బావ చంద్రబాబు సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారంటూ విమర్శించారు. పురందేశ్వరి పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయిందని, రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేక కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరారని అన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా కూడా ఆమెను తీశారని వ్యాఖ్యానించారు.






దూకుడు పెంచిన పురందేశ్వరి
బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వం, నేతలపై విమర్శలు చేస్తూ దూకుడు పెంచారు. ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అక్రమ మద్యం, మద్యం తయారీ, డిస్టలరీలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆయా వాటిలో వైసీపీ నేతలకు వాటాలు ఉన్నాయని, సీఎం జగన్‌కు వాటాలు అందుతున్నాయని పురందేశ్వరి విమర్శిస్తూ వస్తున్నారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ బీజేపీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు. 


తాజాగా విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కేసులపై సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. జగన్, విజయసాయి రెడ్డి పదేళ్ల నుంచి బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు  ప్రజల  జీవితాలను ప్రతికూలంగా  ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని  పదే పదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.