Suresh Babu :  తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని నిర్మాత దుగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు.  అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన  ఉండదన్నారు.  తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా స్పందించలేదు. చంద్రబాబు ది అక్రమ అరెస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్పందిస్తూంటే.. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో సాయం చేసిన చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. అయితే కేఎస్ రామారావు, రాఘవేంద్రరావు వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది స్పందించలేదు. దానికి సినీ పరిశ్రమ పెద్దగా సురేష్ బాబు స్పందించారు. సున్నితమైన విషయాలు అయినందున తాము మాట్లాడలేమని..  గతంలోనూ మాట్లాడలేదని చెబుతున్నారు. 



సున్నితమైన అంశాలపై కామ్ గా ఉంటామని సురేష్ బాబు చెప్పినప్పిటికీ ము చంద్రబాబుకు మద్దతుగా పలువురు స్పందించారు.  రాఘవేంద్రరావు, అశ్వనీదత్,  కేఎస్ రామారావు, నట్టికుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు స్పందించారు. చంద్రబాబు నాయుడు పోరాట మోధుడు అని ఆయనను అక్రమ కేసులు ఏమీ చేయలేదని రాఘవేంద్రరావు అన్నారు.  ‘శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు’ అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


సినీ నిర్మాత అశ్వినీదత్.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అశ్వినీదత్ వీడియోను విడుదల చేశారు.ఈ దేశానికి గొప్ప ప్రధాని, స్పీకర్‌తోపాటు గొప్ప రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయిన దుర్మార్గకరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వారెవరికి పుట్టగతులు ఉండవని అన్నారు.  


ప్రధాని మోదీకి టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల కేఏ ఎస్ రామారావు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. మోదీకి తెలియకుండానే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారా? అని లేఖలో ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసక పాలన మొదలుపెట్టారని అన్నారు. ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని కేఎస్ రామారావు ప్రధాని మోదీని కోరారు.