ఏలూరు జిల్లా చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. కరెంటు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ అంతరాయం వల్ల రోగులు, చంటి బిడ్డలు, బాలింతలు విలవిలలాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటున్నారు. రాగలిగిన రోగులు ఆరు బయటకు వచ్చి కూర్చున్నా.. వారిపై దోమలు దాడి చేస్తున్నాయి. బయటకు రాలేనివారు లోపలనే మగ్గిపోతున్నారు. తెల్లవార్లూ విసురుకుంటూ కూర్చుంటున్నామని రోగులు, చంటిబిడ్డ తల్లులు వాపోతున్నారు. ఆసుపత్రికి విద్యుత్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 


ప్రసూతి వార్డులో కరెంట్ లేదని బాలింతల బంధువులు నర్సులను, వైద్య సిబ్బందిని నిలదీస్తున్నారు. కనీసం జనరేటర్ వేయాలని వారు కోరగా జనరేటర్‌ నడిచేందుకు డీజిల్ లేదని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. ఈ విషయం గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డ్యూటీలోని నర్సులు సమాచారం అందించారు.


కర్రలతో కొట్టుకున్న టీడీపీ-వైసీపీ నాయకులు
మరోవైపు, రాష్ట్రంలో క‌రెంటు కోత‌లపై గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నాయ‌కుల మ‌ద్య మాట మాట పెరిగి దాడుల‌కు వర‌కు వెళ్ళింది. రెండు వ‌ర్గాలు ప‌ర‌స్పరం క‌ర్రల‌తో కొట్టుకున్నారు. దీంతో ప‌ది మందికి గాయాల‌య్యాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నేప‌థ్యంలో పలువురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్య ఉంది. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కువ విద్యుత్ వినియోగం అయ్యే టైంలో కోతలు విధిస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలలో కరెంటు తీసేయడం వల్ల చాలా ఇబ్బంది కర పరిస్థితులు ఉన్నాయని... చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. అధికారికంగా కోతలు విధించినట్టైతే టైం టూ టైం తీస్తారని.. ఇలా అనాధికార కోతల వల్ల టైమే లేకుండా పోతుందంటున్నారు. అడిగి వాళ్లపై స్థానికంగా ఉండే అధికారులు నాయకులు బెదిరించి నోళ్లు మూయిస్తున్నారని కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.