ఓ బాలికకు కరోనా సోకింది. ఆమెకు నాటు వైద్యం చేయిస్తానని చెప్పింది ఓ కిలేడీ. నిజమేననుకుని నమ్మాడు ఆ తండ్రి. కానీ అక్కడకు వెళ్లాక.. బాలిక పరిస్థితి వేరేలా ఉంది. ఆ మహిళ.. బాలికతో వ్యభిచారం చేయించడం ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు.. వారి వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, కారు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, కూతురికి కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తు.. అతడి భార్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో జూన్లో మృతి చెందింది. భార్యకు అంత్యక్రియలు.. అయిపోయాక.. బిడ్డతో ఇంటికి వచ్చాడు. పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది బాలిక. ఆమెకు 13 ఏళ్లు. బాలికకు తండ్రి తప్ప మరెవరు లేరు. అయితే వీళ్ల.. అవసరాన్ని.. పసిగట్టింది అదే గ్రామానికి చెందిన ఓ కిలేడీ. బాలికకు.. నాటువైద్యం చేయిస్తానని తండ్రికి చెప్పింది. రోగం తగ్గుతుందని నమ్మబలికి.. తనతోపాటుగా బాలికను తీసుకెళ్లింది.
ఆమెతో వెళ్లాక బాలిక కష్టాలు మెుదలయ్యాయి. వెళ్లాగానే.. వ్యభిచారం చేయాలంటూ.. బాలికపై ఒత్తిడి తెచ్చింది. తనకు ఆ పనిచేయడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. వినలేదు. చివరకు బాలికను బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. కొన్ని రోజులు.. గుంటూరు, ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించారు.
అయితే ఎలాగోలా.. వాళ్ల దగ్గర నుంచి బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి విజయవాడకు వచ్చింది. అక్కడ బాలికను మరో ముఠా అదుపులోకి తీసుకుని. మళ్లీ వ్యభిచారం చేయించారు. బాలిక చేతికి వేరే వ్యక్తి ద్వారా ఫోన్ రాగా.. ఆమె తన తండ్రికి కాల్ చేసిన జరిగిన విషయం అంతా చెప్పింది. తండ్రి వెళ్లి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కనుగొన్నారు. 23 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 10మంది ఆర్గనైజర్స్ ఉన్నట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని వెల్లడించారు.