Chandrababu Case Updates: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు లీగల్ ములాఖత్‌లు తగ్గించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే జైలు అధికారులు న్యాయపరంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. న్యాయవాదుల ములాఖత్‌లను తగ్గించడంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


గురువారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేశారు. న్యాయవాదులకు ములాఖత్‌లు ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పిటిషన్లకు సంబంధించి చంద్రబాబుతో చర్చించేందుకు లీగల్ ములాఖత్‌లు పెంచాలని ఏసీబీ కోర్టును కోరారు. న్యాయపరమైన అంశాలపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. చంద్రబాబుతో లీగల్ ములాఖత్‌లను జైలు అధికారులు ఇటీవల రెండు నుంచి ఒకటికి తగ్గించారు. 


రోజుకు మూడుసార్లు లీగల్ ములాఖత్‌లకు అవకాశం కల్పించాలని టీడీపీ నేతలు కోరారు. పిటిషన్లపై మాట్లాడేందుకు చంద్రబాబును కలవడానికి జైలు అధికారులు అనుమతించడం లేదని తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.. లీగల్ ములాఖత్‌లు పెంచడంపై విచారించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అటు చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియగా.. వర్చువల్ విధానంలో ఆయన్ను జడ్జి ముందు జైలు అధికారులు హాజరుపర్చారు. చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1 వరకు కోర్టు పొడిగించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి జడ్జి ఆరా తీశారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికలను తనకు అందించాలని ఆదేశించారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఈ సందర్బంగా జడ్జికి బాబు చెప్పారు. దీంతో తనకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని జడ్జి కోరారు. చంద్రబాబు రాసిన లేఖను తనకు అందించాల్సిందిగా జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాదాపు 40 రోజుల నుంచి బాబు జైల్లో ఉన్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా బాబుకు ఊరట లభించలేదు. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణను గురువారం వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. కోర్టుకు దసరా సెలవులు ఉండటంతో చంద్రబాబు న్యాయవాదుల వినతితో వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్వును న్యాయమూర్తులు రిజర్వులో ఉంచారు. శుక్రవారం తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. 21వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ఆ లోపు తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.