స్పేస్ షటిల్ ప్రయోగాల భారత్ లో ఇంకా ఊపందుకోలేదు. 2016లో RLV-TD తో ప్రయోగం చేసినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రయోగాలు ఊపందుకోలేదు. ఇప్పుడు స్పేష్ షటిల్ ప్రయోగాల కోసం రన్ వే నిర్మించేందుకు శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. భవిష్యత్తులో షార్‌లో స్పేస్‌ షటిల్‌ ప్రయోగాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు శాస్త్రవేత్తలు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌ లోని సముద్ర తీరంలో 3 నుంచి 4 కి.మీ మేర రన్‌ వే ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి వర్గాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాయి. రక్షణ శాఖకు సైతం ఉపయోగపడేలా రన్‌ వే ను నిర్మించబోతున్నారు. స్పేస్ షటిల్ ప్రయోగాలతోపాటు, రక్షణ శాఖ అవసరాలను కూడా ఈ రన్ వే తీర్చే అవకాశాలున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రన్ వే నిర్మించాలనుకుంటున్నారు అధికారులు. స్పేస్ షటిల్ ప్రయోగాలు భవిష్యత్తులో ఊపందుకునే అవకాశాలున్నాయి. దీని కోసం ముందుగానే రన్ వే నిర్మిస్తున్నారు.


భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రెండో ప్రయోగ వేదిక విస్తరణపై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. త్వరలో గగన్‌ యాన్‌, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటి భారీ రాకెట్‌ ప్రయోగాలను ఇస్రో చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ప్రయోగాల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రయోగ వేదికలు సరిపోవు, వీటి కోసం ప్రత్యేక వేదిక కావాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. అయితే ప్రత్యేక లాంచ్ ప్యాడ్ నిర్మించాలంటే దానికి 3వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది.


ప్రస్తుతం షార్ లో రెండు లాంచింగ్ ప్యాడ్ లు ఉన్నాయి. వీటికి తోడు అదనంగా మూడో లాంచింగ్ ప్యాడ్ నిర్మించాలంటే 3వేల కోట్లు నిధులు కావాలి, దానికి అదనపు సమయం కూడా పడుతుంది. కొత్త లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలంటే ఐదేళ్లకుపైగా సమయం పడుతుంది. అందుకే ఈప్రతిపాదన విరమించుకున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న రెండో వేదికనే దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై నుంచే గగన్‌ యాన్‌, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటి రాకెట్‌ ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారు.


మార్పులు, చేర్పులు ఇలా..


కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి 3వేల కోట్లు అవసరం, అయితే ఇప్పుడున్న రెండో లాంచింగ్ ప్యాడ్ ను భారీ ప్రయోగాలకు అనుగుణంగా మలచుకోవాలంటే రూ.400 కోట్ల ఖర్చుచేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. దీంతో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం జి.ఎస్.ఎల్.వి మార్క్‌3 వాహకనౌకలో ఎల్‌110 మోటర్లు ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత జరిగే ఎల్.వి.ఎం., జి.ఎస్.ఎల్.వి వాహకనౌకలకు సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు ఉపయోగిస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సెమీ క్రయో స్టోరేజ్‌ తోపాటు అవసరమైన వసతులు రెండో లాంచింగ్ ప్యాడ్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. కేవలం దీనికోసమే రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.


బెంగళూరులో గగన్ యాన్ పనులు..


గగన్‌ యాన్‌ ప్రయోగాలకు అవసరమైన పనులు బెంగళూరులో జరుగుతున్నాయి. దీనికోసం 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో లాంచింగ్ ప్యాడ్ లోనే మార్పులు చేస్తున్నామని షార్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.