ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన టిక్ టాక్ మ్యారేజ్‌లో పెద్ద ట్విస్ట్ ఇది. నిత్యశ్రీని రెండో భార్యగా స్వీకరించిన కల్యాణ్.. చెప్పా పెట్టకుండా మొదటి భార్యను తీసుకుని పరారయ్యాడు. రెండో భార్యకు కనీసం చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో చేసేదేం లేక రెండో భార్య నిత్యశ్రీ అత్తగారింటిలోనే ఉండిపోయింది. 


డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ కి చెందిన కల్యాణ్ కి, విశాఖకు చెందిన నిత్యశ్రీకి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే నిత్యశ్రీతోపాటే విమల అనే మరో మహిళతో కూడా టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన కల్యాణ్ ఆమెతో కూడా చనువుగా ఉండేవాడు. విమల వివాహిత అని, ఏడేళ్ల బాబు ఉన్నాడని తెలిసినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిత్యశ్రీ నెల్లూరు జిల్లాకు వచ్చి కల్యాణ్ తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకుంది. కడపలో ఉన్న విమల ఇంటికి వెళ్లి కల్యాణ్ కోసం ప్రాధేయపడింది. చివరకు కల్యాణ్, నిత్యశ్రీ పెళ్లికి విమల ఒప్పుకుంది, ఆమే పెళ్లి పెద్దగా వ్యవహరించింది. 


ఈనెల 21న పెళ్లి జరగగా, 23న కల్యాణ్ నిత్యశ్రీని ఇంట్లో వదిలేసి విమలను తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటి వరకూ ఫోన్ కాంటాక్ట్ లో లేడు. వారం రోజులు తన భర్తకు గడువిస్తున్నానని, తర్వాత న్యాయ పరంగా తేల్చుకుంటానని అంటున్నారు రెండో భార్య నిత్యశ్రీ. తనదే అసలైన పెళ్లి అని, విమలతో జరిగింది పెళ్లి కాదని ఆమె అంటోంది. 


ఆస్పత్రిలో చేరిన నిత్యశ్రీ..
కల్యాణ్ రెండో భార్య నిత్యశ్రీ ఆస్పత్రిలో చేరింది. ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఇటీవల నిత్యశ్రీ ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మొదటి భార్య విమలపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కల్యాణ్ దారిలోకి వచ్చాడు. నిత్యశ్రీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఏ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తన పరువు తీశావో, అదే ఛానెల్ కి తాను కూడా ఇంటర్వ్యూ ఇచ్చి పరువు తీస్తానని బెదిరించాడట. గతంలో నిత్యశ్రీకి మరో యువకుడితో పరిచయం ఉందని, వారిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత తనకు ఆమె దగ్గరైందని కల్యాణ్ తన స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. నిత్యశ్రీతోపాటు తాను విమలకి కూడా న్యాయం చేయాలని ఇద్దరి భార్యల వద్ద నెలలో చెరో 15 రోజులు ఉంటానని ఒప్పందం కుదుర్చుకున్నాడు కల్యాణ్. అయితే నిత్యశ్రీ గొడవ చేయడంతో ఇప్పుడు అసలు ఆమెను పట్టించుకోకుండానే వెళ్లిపోయాడు. 


కుటుంబ సభ్యుల ఆవేదన....
కల్యాణ్ వల్ల తమ కుటుంబం పరువు పోయిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిత్యశ్రీని పెళ్లి చేసుకుని కల్యాణ్ వెళ్లిపోవడంతో ఆమెను వారే తల్లిదండ్రుల లాగా దగ్గరకు తీశారు. ఆమెను తమ ఇంటిలోనే ఉంచుకుని బాగోగులు చూసుకుంటున్నారు. నిత్యశ్రీయే తన కోడలు అని చెబుతున్నారు. ఈ ప్రేమ, పెళ్లి, రెండో పెళ్లి వ్యవహారంతో తమ పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.