వరుసగా రెండు వాయుగుండాల ప్రభావంతో నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షాలతోపాటు.. పెన్నా నదికి వచ్చిన వరదనీటి ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నీళ్లపాలు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడే నాటిన వరినారు కొట్టుకునిపోయింది. ఇక ఇతరత్రా చిరు ధాన్యాలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టంపై ఇప్పుడిప్పుడే అంచనాలు తయారు చేస్తున్నారు అధికారులు. కేంద్ర బృందం పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో రిపోర్ట్ రెడీ చేశారు. మొత్తం పంట నష్టం అంచనా రూ. 8,47,49,000 గా అంచనా వేశారు. 


నెల్లూరు జిల్లాలో దాదాపుగా 10మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దాదాపు 40 గ్రామాల్లో ప్రజలు వరదలతో అవస్థలు పడ్డారు. వీరిలో చాలామందిని వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వరదసాయం అందిస్తోంది ప్రభుత్వం. కుటుంబానికి 2వేల రూపాయల చొప్పున పరిహారం అందించింది. అయితే వ్యవసాయ నష్టం పరిహారం కోసం కేంద్రం సాయం కోరే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ వెయ్యి కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా అందించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను అంచనా వేశారు. 


నివేదికలు రెడీ.. 
క్షేత్ర స్థాయిలో అధికారులు పంట నష్టంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. చాలా ప్రాంతాల్లో వర్షాలకు ముందే వరికోతలు పూర్తి కావడంతో తీవ్ర నష్టం తప్పింది. అయితే కొన్నిచోట్ల మాత్రం వరిపంటకు నష్టం వాటిల్లింది. అదే సమయంలో వరినారుమడులు పోసుకున్నవారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉల్లిపాయలు, పొగాకు, మినుమ, మిర్చి... అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయి. ఉల్లికి తెగుళ్లు సోకాయి, పొగాకు రంగు మారింది. మిరప చెట్లు నేలకొరిగాయి. సచివాలయాల పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకుల సాయంతో లెక్కలు తేల్చారు అధికారులు. కేంద్రం బృందం వచ్చినప్పుడు నివేదికలు అందించడానికి సిద్ధం చేశారు. 


చేతికొచ్చిన దశలో దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని చెబుతున్నారు అధికారులు. నర్సరీ స్థాయిలో దెబ్బతిన్న వాటికి 80 శాతం రాయితీతో విత్తనాలు ఇస్తామంటున్నారు. మొత్తంగా నెల్లూరు జిల్లాలో 111784 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. 42,747 మంది రైతులు ఈ వర్షాలకు ఇబ్బంది పడ్డారు, పంట నష్టపోయారు. ఆయా రైతులందరికీ నష్టపరిహారం అందించేందుకు అంచనాలు సిద్ధం చేశారు. పంట నష్టం దాదాపు 8.5కోట్ల రూపాయలుగా తేల్చారు. అయితే పంట నష్టంపై జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికల్ని పరిశీలించే కేంద్ర బృందం.. దానిపై ఓ అంచనాకు వస్తుంది. కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. మరోవైపు పశుపోషణపై ఆధారపడిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 


Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త


Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి