కార్డియాక్ అరెస్టుతో ఉన్నట్టుండి మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉండగా తీసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోలో వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి గడిపారు. కొంత మందితో ఎంవోయూలు చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన వీడియోలను పరిశీలించగా.. మంత్రి అప్పుడే కాస్త అసౌకర్యానికి లోనైనట్లుగా కనిపిస్తోంది. పదే పదే ఛాతిని నిమురుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అంతేకాక, ఆయన ఆహార్యంలోనూ కాస్త తేడా కనిపించింది. దానిని బట్టి ఆయనకు అప్పుడే గుండెలో అసౌకర్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఓ వీడియోలో ఉన్న ప్రకారం దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన బృందంతో పాటు వేర్వేరు విదేశీ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఓ ఎక్స్‌పోను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రదర్శించిన వస్తువులను పరిశీలించి.. నడిచి వస్తుండగా మంత్రి ఛాతిపై రెండు సార్లు నిమురుకున్నారు. అదే సమయంలో ఆయన నడకలోనూ కాస్త వ్యత్యాసం కనిపించింది. మొత్తం పర్యటనలో కొన్ని సందర్భాల్లో కాస్త మెతకగా ఉన్నట్లుగా అర్థం అవుతోంది.


వారం రోజుల దుబాయ్ పర్యటన తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 20) నాడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అదే రోజు ఓ నిశ్చతార్థ వేడుకలో కూడా పాల్గొన్నారు. మర్నాడు ఉదయం (ఫిబ్రవరి 21) సోమవారం ఉదయం జిమ్‌కు వెళ్తుండగా ఆయన సోఫాలో కుప్పకూలిపోయినట్లుగా వ్యక్తిగత డ్రైవర్ ‘ఏబీపీ దేశం’తో చెప్పారు. ఆ వెంటనే తాను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లానని అన్నారు. చికిత్స అనంతరం కొద్ది సేపటి తర్వాత మంత్రి చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారని వాపోయాడు.


రేపు (ఫిబ్రవరి 22)న మేకపాటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఉదయగిరిలోని సొంత విద్యా సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ కాలేజీ వద్దకు మార్చారు. ప్రభుత్వ లాంఛనాలతో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. 


ఫోటోలు చూడండి: In Pics: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, ప్రముఖుల నివాళులు


మేకపాటి వారం రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో 12 థీమ్‌లతో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ ప్రారంభించారు. దుబాయ్ ఎక్స్ పోలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో వరుసగా సమావేశం అయ్యారు. టెక్ మార్క్ కంపెనీ, అలానా గ్రూప్ , ఐబీపీసీ, ఎన్ వెంట్, కూ,రెగల్ ట్రేడర్స్,నికయ్ గ్రూప్,ఈఎస్పీఏ కంపెనీల ఛైర్మన్, ఎండీలు, ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. దుబాయ్ పర్యటనలో మూడు ఎంవోయూలను కుదుర్చుకున్నారు. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నారు. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఒప్పందం, రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు రీజెన్సీ గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది.