Narayana in Nellore: మాజీ మంత్రి నారాయణ ఈసారి విజయం కోసం మరింత కసిగా పనిచేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి కూడా తాను ఓడిపోయిన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఈసారి గెలిచి చూపిస్తానంటున్నారు. టీడీపీ నుంచి నారాయణ అభ్యర్థిత్వం ఖరారైంది. వైసీపీలో అన్నీ అనుకున్నట్టు జరిగితే అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు ప్రత్యర్థిగా మారుతారు. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనిల్ ఇక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయనకి పోటీగా నారాయణ కూడా ఫుల్ టైమ్ ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. చేరికలు, వివిధ కార్యక్రమాలతో ఆయన బిజీ అయ్యారు. 


ఆటో కార్మికుల చేరిక..
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 300మంది ఆటో కార్మికులు టీడీపీలో చేరారు. నారాయణ కూడా ఆటో డ్రైవర్ డ్రస్సులో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖాకీ చొక్కా వేసుకుని వారిలో కలసిపోయారు. ఆటో డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. వారికి కండువాలు కప్పి టీడీపీలోకి స్వాగతం పలికారు. 


ఆటోయ‌జ‌మానులు, డ్రైవ‌ర్లు, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై తాము ప్ర‌త్యేక దృష్టిసారించామ‌ని తెలిపారు నారాయణ. ఈ మేర‌కు ఆయా ప్రాంతాల్లో డివిజ‌న్ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు తాము ప్ర‌త్యేకంగా వారితో మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. తాను కూడా ఓ కార్మికుని కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడినేన‌ని, త‌న తండ్రి ప్రైవేట్ బ‌స్సు కండెక్ట‌ర్ అని చెప్పారు నారాయణ. త‌న మేన‌మామ కూడా కార్మికుడేనని.. స‌మ‌స్య‌లు తెలిసిన వ్య‌క్తిని కాబ‌ట్టే కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని చెప్పారు. న‌గ‌రంలోని ప్ర‌తి ఒక్క కార్మికుడి ఇంటికి వెళ్లి క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకుంటాన‌న్నారు నారాయణ. పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని వారికి సూచించారు. 


గతంలో ఇలా..
తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు వీఆర్ హైస్కూల్‌ లో పేద‌పిల్ల‌ల కోసం  రెసిడెన్షియ‌న్ కాలేజీ ఏర్పాటు చేసి, 6 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో నారాయ‌ణ కాలేజీ స్టాఫ్‌తో విద్య చెప్పించామ‌న్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో ఓ విద్యార్థి ఆ స్కూల్ గురించి గొప్పగా చెప్పారని.. అలాంటి స్పందనలు విన్నప్పుడు తనకు సంతోషం కలుగుతుందని చెప్పారు నారాయణ. నిరుపేద‌ల కోసం ఎంతో చేసిన తాము ఆర్భాటాల‌కు పోలేద‌ని, మిగ‌తా వాళ్లలాగా కొంచెం చేసి ఎక్కువ చెప్పుకోవ‌డం త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. ఆటోయ‌జ‌మానులు, కార్మికుల‌తో పాటు నిరుపేద‌లకోసం..43 వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని.. నిర్మాణాలు పూర్త‌యి పేద‌ల‌కు ఇవ్వ‌బోయే స‌మ‌యానికి ఎన్నిక‌లు రావ‌డంతో ఆ పని సాధ్యం కాలేదని వివరించారు. ఆ త‌ర్వాత వైసీపీ గెలిచినా.. ఆ ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌కుండా నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు నారాయణ. 


తాను ఎమ్మెస్సీ చ‌దివే వ‌ర‌కు తాటాకుల ఇంట్లోనే ఉన్నాన‌ని చెప్పారు నారాయణ. అక్క‌డ ట్యూష‌న్ చెప్పాన‌ని, తన ఫ‌స్ట్ స్టూడెంట్ ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అని చెప్పారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పేద‌ల క‌ష్టాలు తెలిసిన వ్య‌క్తిన‌ని, మాట‌లు చెప్పే వ్య‌క్తిని కాద‌ని, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటాన‌ని చెప్పారు నారాయణ. నెల్లూరులో ఓ పేద‌కుటుంబంలో పుట్టి ఉన్న‌త స్థితికి ఎదిగాను కాబ‌ట్టే త‌న‌వంతుగా నెల్లూరును విస్తృతంగా అభివృద్ధి చేశాన‌న్నారు. 


నెల్లూరు సిటీలో పోటీని ఈసారి నారాయణ ఆషామాషీగా తీసుకోవట్లేదు. మంత్రి హోదాలో ఉండి 2019లో ఆయన ఎన్నిక ఓడిపోయారు. గెలుపుపై ఉన్న ధీమానే ఆయన ఓటమికి కారణం అనేది తెలిసిన విషయమే. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. ఈసారి మాత్రం టీడీపీ జెండా ఎగురవేస్తానంటున్నారు. నెల్లూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు నారాయణ.