AP Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 1 నాటికి వారికి పెరిగిన జీతాలు అకౌంట్లలో పడతాయి. ప్రొబేషన్ కాలం అధికారికంగా పూర్తయినట్టవుతుంది. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు అన్ని జిల్లాల్లో థ్యాంక్యూ సీఎం సర్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా థ్యాంక్యూ సీఎం సర్ కార్యక్రమం జరిగింది. నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా నాయకులు, జిల్లాలోని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరయ్యారు. 



దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారిలో కొంతమంది అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారని, అలాంటి వారందరిలో సీఎం జగన్ ప్రత్యకత కలిగిన వ్యక్తి అని అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. మాట్లాడుతూ 2019 ఎన్నికల ప్రణాళికలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు గురించి తాము ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలు ఏర్పాటు చేస్తామని చెబితే చాలా మంది హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు కాకాణి. అయితే ఒకే నోటిఫికేషన్‌తో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని చెప్పారు కాకాణి. నెల్లూరు జిల్లాకు సంబంధించి 6,688కి గాను 5,468 మందికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసినట్టు తెలిపారు. వారందరికీ కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అందుతాయని భరోసా ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే సాంకేతికపరమైన ప్రక్రియను పూర్తి చేసి పెరిగిన జీతాలు అందించోతున్నట్టు పేర్కొన్నారు కాకాణి. 


సచివాలయ ఉద్యోగాలకు అర్హత డిగ్రీయే అయినా.. చాలామంది ఉన్నత విద్యావంతులు ఉండటం ఈ వ్యవస్థ గొప్పతనం అని అన్నారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సచివాలయ ఉద్యోగులు అంటే ప్రజల్లో గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని మరింత పెంచుకునేలా వారి పనితీరు ఉండాలని సూచించారు. 


సచివాలయ వ్యవస్థ, వాలంటరీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రికి రెండు కళ్లు లాంటివని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సచివాలయ వ్యవస్థతో సరికొత్త మార్పుకి జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు చెప్పిన విధంగానే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్నారని, పెరిగిన వేతనాలు అందుకోబోతున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 


ఇక సచివాలయ ఉద్యోగులు థ్యాంక్యూ సీఎం సార్ కార్యక్రమానికి ముందు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేసిన సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు సకాలంలో అందేందుకు తామంతా కృషి చేస్తున్నామని చెప్పారు. మెరుగైన పనితీరుతో ప్రభుత్వానికి మరింత మంచిపేరు తెస్తామన్నారు. తమ కుటుంబాల్లో సంతోషం నింపిన సీఎం జగన్ కి కృతజ్ఞతతో ఉంటామన్నారు.