తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్​ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రంపచోడవరంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి లోకేశ్‌ నివాళులులర్పించారు. రంపచోడవరం, గోకవరం, దేవీపట్నం మండలాల్లో పర్యటిస్తున్నారు. దేవిపట్నం మండలం, ఇందుకూరు గ్రామ నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. 


'50 కోట్లు విడుదల చేశాం అని అధికారులు అంటున్నారు. ఈ రోజు వరకూ ఒక్క రూపాయి రాలేదు. కనీసం ఈ రోజు వరకూ ప్యాకేజీ కోసం అర్హుల లిస్ట్ ప్రకటించడం లేదు. తాగడానికి మంచి నీళ్ళు కూడా పునరావాస కాలనీల్లో అందించడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చెయ్యడానికి శ్మశానం కూడా లేదు.' అని ఇందుకూరు గ్రామ నిర్వాసితులు చెప్పారు.


ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి పోలవరం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క చంద్రబాబు గారే 11 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు ని 72 శాతం పూర్తి చేశారని నారా లోకేశ్ చెప్పారు. గాలి మాటలు చెప్పి జగన్ రెడ్డి గిరిజనుల్ని మోసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 వేల కోట్లను నిర్వాసితులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందని ఆరోపించారు.  25 వసతులతో కాలనీలు కడతా అన్నారని.. కనీస మౌలిక వసతులు లేవని చెప్పారు. ముఖ్యమంత్రి ప్యాలస్ ముట్టడించైనా పోలవరం నిర్వాసితులకి న్యాయం జరిగేలా చూస్తామని లోకేశ్ అన్నారు. పోలవరం నిర్వాసితులు వరదలో  ఉంటే సీఎం సిమ్లా వెళ్లి ఎంజాయ్ చేసోచ్చారన్నారు. జగన్ రెడ్డి గిరిజనుల్ని జలసమాధి చేస్తా అంటే ఊరుకొనని లోకేశ్ హెచ్చరించారు. శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ లో పోలవరం నిర్వాసితుల కోసం టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.


 


పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా మంగళవార కూనవరం  మండల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితులతో లోకేశ్ మాట్లాడారు. 2019లో వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను ప్రభుత్వం కనీసం ఆదుకోలేదన్నారు. రూ.2,500 సాయం చేయలేని వైకాపా సర్కార్.. రూ.10 లక్షలు ఎలా ఇస్తుంది? అని అడిగారు. 



నిర్వాసితులకు మొత్తం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటీ కట్టలేదని లోకేశ్ ఆరోపించారు. ఈ ఏడాది జులై నాటికి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారని.. కానీ ఈ రెండున్నర ఏళ్లలో కేవలం రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయో చెప్పాలని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం వల్లే విలీన మండలాలు ఏపీలో కలిశాయని గుర్తు చేశారు. గిరిజనులపై అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.  


Also Read: Minister Kannababu: పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకో లోకేశ్.. మెుత్తం మీరే చేశారు