Janasena News :     జనసేన పార్టీలో కీ  ని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు  కీలక పదవి అప్పగించారు.  ఇప్పటి వరకూ ఆయన  రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు మాత్రమే. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఈ పదవి అప్పగించడంపై నాగేంద్ర బాబు స్పందించారు. 2019నుండి జ‌న‌సేన‌లో క్రియాశీల‌కంగా ప‌ని చేస్తున్నాన‌ని అన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ‌బాబు. తన నియామకం తర్వాత నాగబాబు తొలిసారిగా స్పందించారు. పీఏసీ మెంబర్ ని అయినప్పటికీ సాధారణ కార్యకర్తలాగానే పార్టీ కోసం కృషి చేశాన‌న్నారు. పదవుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదని, పార్టీ కోసం తాను ఏం చేయగలనన్నదాని గురించే ఆలోచించానని చెప్పారు. 


 





 


జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను, భావజాలాన్ని, ఆయన త్యాగనిరతిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని వివరించారు. పవన్ కల్యాణ్ వంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అని ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో మరింత ఎక్కువగా జనసైనికులు, వీరమహిళలను కలుస్తుంటానని, తనను ఎవరైనా కలవొచ్చని సూచించారు.


తాజా నియామకం అనంతరం మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంద‌న్నారు. ప్రధాన కార్యదర్శి అనేది ఒక పదవిలా భావించడంలేదని, ఇది ఒక బాధ్యత అనుకుంటున్నానని అన్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ కోసం పాటుపడతానని ఉద్ఘాటించారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై చొరవ చూపిస్తామ‌న్నారు. ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో జనసేన పార్టీలో  నాగబాబు పాత్ర మరింత పెరగనుంది. ఓ రకంగా ఇక నుంచి ఆయన నెంబర్ టు గా ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  ప్రధాన కార్యదర్శి అంటే ఏ పార్టీలో అయినా కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు  అన్ని విషయాలూ పట్టించుకోలేరు. రోజు వారీ వ్యవహారాలను అసలు చూసుకోలేరు. అందుకే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. 


నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే  ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ ఆయనకు ఎలాంటి కీలక పదవి ఇవ్వలేదు.   జనసేనానికి ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు వీటన్నింటినీ కంప్లీట్ చేసి రాజకీయ యాత్రలు ప్రారంభించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. మరో వైపు ఇప్పుడు పార్టీలో నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన ఒక్కరే కొంత కాలంగా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.  జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు జిల్లాల పర్యటనలను నాగబాబు చేపట్టే అవకాశం ఉంది.