కేంద్ర ప్రభుత్వం రూ.4,445 కోట్ల వ్యయంతో దేశంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అప్పరెల్‌ పార్క్ (మిత్రా)లలో ఒకటి ఏపీలో ఏర్పాటుచేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కడప జిల్లా కొప్పర్తిలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టెక్స్ టైల్ పార్క్ ద్వారా స్పిన్నింగ్‌, డైయింగ్‌, ప్రింటింగ్‌ ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలుంటుందన్నారు. తద్వారా టెక్స్‌టైల్‌ వాల్యూ చైన్‌ యావత్తు ఒకే చోట సమీకృతం అవుతుందన్నారు. మెగా టెక్స్ టైల్ పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు. ఫలితంగా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పార్కుల ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా టెక్స్‌టైల్‌ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవో సస్పెన్షన్.. పాత విధానంలోనే రేట్స్ ఖరారు చేయాలన్న హైకోర్టు !


కాటన్, సిల్క్ ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానం


కడప జిల్లా కొప్పర్తి ఇప్పటికే అనేక టెక్స్‌టైల్‌ ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి చెందుతుందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇటీవల ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. కాబట్టి మిత్రా పార్క్ అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. గత కొన్నేళ్ళుగా ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు  గమ్యస్థానంగా ఉందన్న ఆయన... ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు  అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రకటించి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల అనుకూల ప్రాంతంగా ప్రమోట్‌ చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో కాటన్‌, సిల్క్‌ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది నిపుణులైన హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ కార్మికులు ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కాబట్టి మిత్రా పార్క్‌ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. మిత్రా పార్క్‌ రాష్ట్రం మొత్తానికి నోడల్‌ పాయింట్‌గా అభివృద్ధి చెంది సప్లై చైన్‌ సమీకృతం కావడానికి దోహదం చేస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.


Also Read:  ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్


ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు


కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఏపీలో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ తెలిపారు. రాజ్యసభలో  మంగళవారం ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ, అనంతపురంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అభివృద్ధికి ఆమోదం తెలిపామన్నారు. అలాగే పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. 


Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి