AP Latest News: క్రిష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల వయసు ఉన్న ఓ మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఆ ఫుటేజీ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయం వెలుగులోకి రాగానే వెంటనే స్పందించిన పోలీసులు కెమెరాలను పరిశీలించి ఆ నిందితురాలిని పట్టుకోగలిగారు. వెంటనే శిశువును కన్న తల్లి దగ్గరికి చేర్చారు. 


ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఈమెకు 3 రోజుల‌ క్రితం మగబిడ్డ పుట్టింది. ప్రస్తుతం ఆమె గైనిక్ వార్డులో ఉంది. ఇంకా డిశ్చార్జి కాలేదు. గత అర్ధరాత్రి 1.30 గంటల వేళ గుర్తుతెలియని ఓ మహిళ నర్సు వేషం వేసుకొని వచ్చి పిల్లాడిని ఎత్తుకెళ్లింది. 


వెంటనే గుర్తించిన స్వరూప రాణి బంధువులు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే మగ బిడ్డను తీసుకెళ్లిన మహిళను ఇంగ్లీష్‌ పాలెంలో గుర్తించారు. ఆమె వద్ద నుంచి శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు.