నిన్న జరిగిన తోపులాటలో తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి షర్ట్ చిరిగిపోయిందని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు ఆయన కూతురు జ‌స్వంతిరెడ్డి. అభిమానుల నుంచి కాల్స్ రావడంతో జరిగిన ఘటనపై స్పందించిన జస్వంతి రెడ్డి మాజీ మంత్రి అఖిల ప్రియపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి చాలా సభలు, కార్యక్రమాలలో తాను, ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదని చెప్పినట్లు గుర్తుచేశారు.


చిన్నప్పటినుంచీ అఖిలప్రియను ఎత్తుకుని పెంచిన వ్యక్తి తన తండ్రి సుబ్బారెడ్డి అన్నారు. తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆమె దాడి చేయించడం దారుణం అన్నారు. ప్రశాంతంగా యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అఖిలప్రియ తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించారని ఆరోపించారు. ఇది తొలిసారి జరిగిన దాడి కాదని, గతంలో టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రలోనూ తమపై దాడి జరిగిందన్నారు. ఎలాంటి టైమ్ లో ఏం చేస్తుందోనని ఆలోచించకుండా బజారు మనిషిలా అఖిల ప్రియ వ్యవహరించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


హైదరాబాద్ లో తమ ఇంటిపై రెక్కీ నిర్వహించి, తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించేందుకు మనుషుల్ని ఏర్పాటు చేసి కుట్ర చేసిందని ఆరోపించారు. లో గ్రేడ్ ఆలోచనలతో ఆమె ఇలాంటి పనులు చేసింది. అయినా కూడా చిన్నప్పటినుంచీ ఆమెను ఎత్తుకుని ప్రేమగా వ్యవహరించిన వ్యక్తి కనుక, కూతురులాగ చూసుకున్నాడని ప్రశాంతంగా ఉన్నారని జస్వంతి రెడ్డి చెప్పారు. పార్టీని గౌరవించి చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని, నిన్న జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.



లోకేష్ అన్న పాదయాత్ర డిస్బర్బ్ అవుతుందని తానుగానీ, తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిగానీ ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదన్నారు. కానీ తండ్రి సమానమైన వ్యక్తిపై దారుణమైన ఆరోపించడానికి అఖిలప్రియకు మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు. చేసిన ఆరోపణలపై ఆమెతో ఆధారాలు ఉన్నాయా, ఉండవు అన్నారు. బజారు మనిషిలా అంత దారుణమైన వ్యాఖ్యలు చేసే మనిషి అఖిలప్రియ అంటూ మండిపడ్డారు. 


పార్టీ ఆదేశిస్తే పోటీకి సై..  
ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పోటీ చేయాలని పార్టీ తమను ఆదేశిస్తే తానైనా, లేక తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి అయినా సరే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జస్వంతి రెడ్డి. ఒకవేళ అఖిలప్రియకు టికెట్ ఇస్తే మాత్రం ఆమె పతనానికి తాము పోటీ చేస్తామని వీడియోలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.


నంద్యాల టీడీపీలో మొదలైన అంతర్యద్దం అరెస్టుల వరకు వెళ్లింది. నిన్న రాత్రి  ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు భార్గవ్‌ రామ్‌, పీఏ మోహన్‌కు కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని నంద్యాల పీఎస్‌కు తరలించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం అఖిలప్రియ దంపతులను కోర్టులో ప్రవేశపెట్టారు. అఖిలప్రియ దంపతులకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.