Kadapa News: అమ్మానాన్నలు తనను వదిలేసి వెళ్లిపోయారని.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో, ప్రస్తుతం తాను ఏం చేయాలో తెలియక కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని ఓ ఏడేళ్ల బాలుడు ఏడుస్తూ చెబుతున్నాడు. కలెక్టర్ లేరని చెప్పడంతో అక్కడే కూర్చుండిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 


అసలేం జరిగిందంటే..?


వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెకు చెందిన బాలుడు రెండు రోజుల కిందట కలెక్టర్ ను కలిసేందుకు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఉదయం నుంచి కలెక్టరేట్ లోని తిరుగుతున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎస్సై మధుసూదన్ రెడ్డి గుర్తించారు. వెంటనే బాలుడిని పిలిచి నీ పేరేంటి, నువ్వు ఎవరితో వచ్చావు అంటూ ఆరా తీశారు. బాలుడు ఏమీ మాట్లాడకపోవడంతో ఒకటో పట్టణ ఠాణాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మెల్లిగా నువ్వు కడప ఎందుకు వచ్చావని అడిగారు. ఇంత చిన్న వయసులో ఒంటరిగా తిరగడం ఏంటి, మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారంటూ ప్రశ్నించారు.


పోలీస్‌ వాళ్ల ప్రశ్నలకు బాలుడు ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తూనే తన వివరాలు చెప్పాడు. తన అమ్మానాన్నలు తనను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారని, ఎక్కడికి వెళ్లారో కూడా తనకు తెలియని చెప్పాడు. అందుకే కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని.. కానీ కలెక్టర్ సార్ లేకపోవడంతో.. అక్కడే వేచి చూస్తున్నానని వివరించాడు. అది విన్న పోలీసులు అయ్యో పాపం అనుకున్నారు.  


వెంటనే నువ్వేం బాధ పడకు అంటూ బాలుడికి భరోసాను ఇచ్చారు. బాలుడికి తోడుగా ఓ కానిస్టేబుల్ ను పంపి వేంపల్లెలో ఉన్న తన తాత వద్ద వదిలి పెట్టారు. ఇదే విషయంపై స్పందించిన ఎస్సై... భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాలని, పిల్లలను ఒంటరిగా వదిలేసి వెళ్లడం సరికాదని చెప్పారు. ఇలా వదిలేసి వెళ్లడం వల్ల పిల్లలు చాలా మానసిక వ్యథకు గురవుతారని వివరించారు. ఆ బాలుడి ఏడుపు చూస్తే మనసు తరుక్కుపోయిందని అన్నారు. 


తనకు క్యాన్సర్ ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్పొద్దన్న బాలుడు


కొన్ని రోజుల క్రితం ఆరేళ్ల పిల్లాడు ఓ డాక్టర్‌కు చెప్పిన విషయం వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ చిన్నారి. "నేను ఎక్కువ కాలం బతకను. ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకండి. బాధ పడతారు" అని ఓ వైద్యుడికి చెప్పాడు. ఇది విన్న ఆ వైద్యుడి నోట మాట రాలేదు. "ఆరేళ్ల  పిల్లాడేనా ఇలా మాట్లాడేది" అని ఆశ్చర్యపోయాడు. ఆ చిన్నారికి క్యాన్సర్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆ డాక్టర్‌తో చెప్పాడు. "నేను ఆరు నెలల కన్నా ఎక్కువ బతకను. నాకున్న లక్షణాలను బట్టి ఇది క్యాన్సర్ అని గూగుల్‌లో వెతికి తెలుసుకున్నా. ఈ విషయం అమ్మనాన్నలకు తెలియదు. మీరూ చెప్పకండి. నా చివరి రోజుల్లో వాళ్లు ఆనందంగా చూడాలని కోరుకుంటున్నా" అని ఆ వైద్యుడికి చెప్పాడు ఆ ఆరేళ్ల చిన్నారి. క్యాన్సర్ మహమ్మారి ఆ బాలుడిని బలి తీసుకున్నాక కానీ...ఆ వైద్యుడు ఎవరికీ చెప్పలేదు. ఆ చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోడం కోసం ఆ బాధను అలా గుండెల్లోనే దాచుకున్నాడు. ఆ చిన్నారి మరణించాక... ట్విటర్‌లో ఈ కన్నీటి కథను పోస్ట్ చేశారు. వరుస ట్వీట్‌లతో నెల రోజుల క్రితం అసలు విషయం అంతా చెప్పారు. ఆయనె చెప్పిన వివరాల ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన దంపతులకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. వయసు ఆరేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లి టెస్ట్‌లు చేయించారు. అప్పుడే ఆ బాబుకి క్యాన్సర్‌ ఉందని తేలింది. ఇది విని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఏం జబ్బు వచ్చిందో ఆ చిన్నారికి తెలయనీయకుండా జాగ్రత్తపడ్డారు. మందులు వాడారు. కానీ...ఆ చిన్నారి మాత్రం తనకు ఇస్తున్న మెడిసిన్ ఏంటో గూగుల్‌లో వెతికాడు. తనకు క్యాన్సర్ ఉందని అర్థం చేసుకున్నాడు.