Devaragattu Bunny Festival in Kurnool District | విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం. స్వామిని దక్కించేందుకు మూడు గ్రామాల ప్రజలు పోటీ జరుగుతుంది. దసరా రోజు అర్థరాత్రి కర్రలతో నృత్యాలు.. రక్తపాతాలు.. దసరా వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో జరిగే బన్ని కర్రల సమరం (Devaragattu Bunny Festival) గుర్తొస్తుంది. అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బన్ని ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే.. స్వామి వారిని దక్కించేందుకు భక్తులు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. విజయదశమి రోజు జరిగే ఈ బన్నీ ఉత్సవం జరుగుతుందా... అధికారుల అవగాహన కర్రల సమరాన్ని అపుతుందా.. ఎందుకు కర్రల సమరాన్ని జరుపుకుంటారు ఈ స్టోరీ లో తెలుసుకుందాం. 


 సంప్రదాయాలకు నెలవు కర్నూలు జిల్లా : 
కర్నూలు జిల్లా సంప్రదాయ పండుగలకు ప్రసిద్ధి. ఉగాది పండుగకు గాడిదల ఊరేగింపు, పీడకల సమరం. ఇప్పుడు విజయదశమికి కర్రలతో బన్నీ ఉత్సవం.. ఏది చేసినా గ్రామంలో నెల రోజులుగా హడావుడి కనిపిస్తుంటుంది. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు ఈ నెల 9 వ తేదీన కంకణధారణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. పండుగ వస్తుందంటే ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలంలోని నెరణికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామాల భక్తుల్లో నిష్ఠ, నిబద్ధత నెలకొంటుంది. ఆ మూడు గ్రామాల భక్తులు కులమతాలకు అతీతంగా కఠోర దీక్షకు శ్రీకారం చుడతారు.


 అసలు బన్నీ ఉత్సవం అంటే ఏమిటి : 
విజయదశమికి కర్రలతో భక్తులు ఎందుకు తలపడతారు ? అర్థరాత్రి విశేషం ఏంటంటే.. శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా రోజు అర్ధరాత్రి జరిగే బన్ని జైత్ర యాత్రలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కర్రలు, కాగడాలు చేతుల్లో పట్టుకొని ఒకేసారిగా కొండపైకి చేరుకుంటారు. దేవుళ్లను తమ గ్రామాలకు తీసుకెళ్లేందుకు మూడు గ్రామాల భక్తుల మధ్య పోటీ నెలకొంటుంది. ఈ క్రమంలో కర్రల సమరం జరుగుతుంది. పలువురు గాయపడతారు. గాయపడిన వారికి దగ్గర్లోనున్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. అయితే స్వామి వారి బండారం పూస్తే గాయం తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తారు. మరోవైపు ఇది కర్రల సమరం కాదని కర్రల ఉత్సవం అని ఆలయ అర్చకులు గిరిసామి చెబుతున్నారు.


 కఠిన నియమాలతో భక్తులు : 
 మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దసరా బన్ని ఉత్సవాలు ప్రారంభానికి ముందే ఆయా గ్రామాల ప్రజలు మద్యం, మాంసం, ఇతర అంశాలకు దూరంగా ఉండటంతోపాటు కటిక నేలపైనే నిద్రపోతారు. బన్ని ఉత్సవాలు ముగిసే వరకు గ్రామస్థులెవరూ వారం రోజుల పాటు నియమాలతో దేవుడి పై భక్తితో ఉంటారు. ఉత్సవమూర్తులను తిరిగి దక్కించుకోవడానికి తామంతా ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఏ ప్రలోభాలనూ దరిచేరనివ్వకుండా దైవకార్యమే ప్రధాన లక్ష్యమని విశ్వసిస్తారు. నెరణికిలో కొలువై ఉండే స్వామివారి ఉత్సవమూర్తులు దేవరగట్టుకు తరలించడంతోపాటు వాటిని బన్ని ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామానికి చేర్చే వరకు ప్రజలంతా ఈ కట్టుబాట్లు పాటిస్తుండటం ఆనవాయితీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. విజయదశమి రోజున జరిగే కర్రల సమరం కాదని కర్రల సంప్రదాయం అని చెబుతున్నారు గ్రామస్తులు. 


 ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అనాదిగా వస్తున్న ఆచారం కొనసాగిస్తూన్న గ్రామస్తులు : 
ఏటా బన్ని ఉత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. స్థానికులు వేల సంఖ్యలో ఉంటారు. వీరందరూ కర్రల సమరంలో పాల్గొనేందుకు వస్తుంటారు. అయితే ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు ఇప్పటికే గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. ఆదోని సబ్ కలెక్టర్, పత్తికొండ డీఎస్పీ, రెవిన్యూ అధికారులు దేవరగట్టు కు చేరుకొని ఏర్పాట్లతో పాటు పలు అంశాలపై చర్చించారు . బన్ని వేడుకను హింసాత్మకంగా నిర్వహించవద్దని, కోరుతున్నారు. ఏటా కర్రల నియంత్రణకు పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 


కొండపై మల్లేశ్వర స్వామి : 
దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఎత్తైన కొండలలో కొలువై ఉన్నారు. ఈ స్వామివారిని దర్శించేందుకు దాదాపుగా 300 మెట్లు ఎక్కి దర్శించుకోవాలి. ఇప్పటికే అధికారులు కొండపై వెళ్లే భక్తులకు పలు సూచనలు చేస్తూ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి ప్రతి ఏటా మాదిరిగానే  ఈ సంవత్సరం కూడా దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం అదే కర్రల సంప్రదాయం ను నిర్వహించేందుకు నేరనికి , నేరనికితండా కొత్తపేట గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. విజయదశమి రోజున అర్ధరాత్రి జరిగే ఈ బన్నీ జైత్రయాత్ర ఉదయం గ్రామ చివరన ఉన్న పాదాల కట్ట వరకు చేరుకొని అక్కడ రక్త తర్పణం చేసిన అనంతరం ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.


Also Read: Vijayadashami 2024: ఎవరీ మహిషాసురుడు? దేవతులకు ఎలా శత్రువు అయ్యాడు.? తల్లిదండ్రులు ఎవరు?