Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,695 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 92.924 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదే స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగితే.. ఈ నెల చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎగువన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్ కు సైతం ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ కు 1,04,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. గేట్లు ఎత్తి 84,792 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.493 టీఎంసీల నీటి నిల్వ ఉంది.


శ్రీశైలం జలాశయం నిండి దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసే నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిష్టం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్.. ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న స్పిల్ వే, క్రస్ట్ గేట్ల మరమ్మతుల పనులను పరిశీలించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం విజయ విహార్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కడెం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మొరాయించినట్లు సాగర్ ప్రాజెక్టు గేట్లు మొరాయించకుండా వరద వచ్చే నాటికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో ఉన్న 12 డివిజన్లు, 3 సర్కిళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోత పథకాల పనులపై ఆరా తీశారు. జిల్లాలో సాగర్ ప్రాజెక్టు పరిధిలో 70.3 కిలోమీటర్ల మేర కాల్వలు, 1.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, నీటి పారుదల ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మ్యాపుల ద్వారా అధికారులు కలెక్టర్ కు వివరించారు. 


Also Read: Seema Haider: సినిమా ఛాన్స్ కొట్టేసిన పాకిస్థాన్‌ మహిళ- రీల్‌ రా ఏజెంట్‌గా సీమా హైదర్!


కొత్తగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సాగర్ కు తొలిసారి వచ్చిన కలెక్టర్ కర్ణన్.. సాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సందర్శించారు. డ్యామ్ భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎస్పీఎఫ్ పోలీసులతో పటిష్ఠ  భధ్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. అదే విధంగా హిల్ కాలనీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం నాట్కో ఫార్మా కంపెనీని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. పరిశ్రమ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలు నదిలోకి వెళ్లకుండా చూడాలని సంబంధిత కంపెనీ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్టు సీఈ అజయ్ కుమారు, ఎస్ఈ నాగేశ్వర్ రావు, ఈఈ మల్లిఖార్జున్ రావు, మాల్ సర్కిల్ ఎస్ఈ వెంకటేశ్వర్ రావు, వ్యవసాయశాఖ జేడీ సుచరిత, హర్టికల్చర్ అధికారి సంగీత లక్ష్మీ, ఆర్‌డబ్ల్యూ ఎస్ఈఈ ముజీబుద్దీన్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.