JC On DSP :  వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు చాలా మంది అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో ఇప్పటి వరకూ సివిల్ సర్వీస్ అధికారుల పేర్లే ఎక్కువగా వినిపించేవి. అయితే ఇప్పుడు కొత్తగా ఇతర ర్యాంకుల అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాడిపత్రి డీఎస్పీ చైతన్య భీమవరం నుంచి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ పై ఎన్నికల బరిలో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని ... టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇందుకు లాజిక్కులు కూడా ఆయన చెబుతున్నారు. 


వైఎస్‌ఆర్‌సిపి ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణ


వైఎస్‌ఆర్‌సిపి ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని అన్నారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు.ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తమకు చెందిన 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని. చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. 


డీఎస్పీ చైతన్యపై ఇప్పటికే పన్నెండు ప్రైవేసు కెసులు పెట్టిన టీడీపీ నేతలు


ఆయనపై ఏకంగా 12 ప్రైవేట్ కేసులు పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఆయన అక్రమాలను వదిలిపెట్టేది లేదన్నారు. డీఎస్పీ అధికార పార్టీకి కార్యకర్తలా పనిచేస్తూ.. ఎమ్మెల్యే చెప్పినట్లుగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి..  డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైఎస్‌ఆర్‌సిపి తరపున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.   తాడిపత్రి డీఎస్పీ క్యారెక్టర్‌ లేని వ్యక్తి అన్నారు. తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని పెద్దపప్పూరు, పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు డీఎస్పీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మట్కా, క్రికెట్‌, గంజాయి మాఫియాలతో డీఎస్పీకి సంబంధాలున్నాయని ఆరోపించారు జేసీ.


చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు


తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై తెలుగుదేశం పార్టీ నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఏం చేసినా చూస్తూ ఉంటారని..కానీ టీడీపీ నేతలపై మాత్రం పోలీసులు ఉద్దేశపర్వకంగా దాడులు చేస్తూంటారని..కేసులు పెడుతూ ఉంటారని ఆరోపిస్తూంటారు. డీఎస్పీ చైతన్య తీరు రాజకీయంగా కాకుండా విధి నిర్వహణ పరంగా కూడా అనేక విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పుడు అనూహ్యంగా ఆయన పేరు భీమవరం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 


వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానం, అన్నదాతలపై వాలంటీర్ల పెత్తనమా? - చంద్రబాబు